కేసీఆర్ సవాల్కు నిలుస్తారా?: ప్రతిష్ఠ కాపాడుకుంటారా?
హైదరాబాద్: తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ప్రతిష్ఠాత్మక పథకం 'మిషన్ భగీరథ'. గతంలో సిద్ధిపేటకు మాత్రమే పరిమితమైన ఇంటింటికి తాగునీటి సరఫరా పథకం అమలు చేసిన ఈ పథకానికి 'మిషన్ భగీరథ' పేరిట రాష్ట్రమంతా గ్రామగ్రామాన.. ఇంటింటికి తాగునీటి సరఫరాకు సంకల్పించారు.
తొలుత రాష్ట్ర గ్రామీణాభివ్రుద్ధి శాఖ మంత్రిగా కల్వకుంట్ల తారక రామారావు ఈ పథకం అమలును పర్యవేక్షించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయ్యాక కేటీఆర్ పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 'మిషన్ భగీరథ' పథకం అమలుకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి.. దానికి ఎమ్మెల్యే ప్రశాంత రెడ్డిని వైస్ చైర్మన్గా నియమించారు సీఎం కేసీఆర్. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయకుంటే ఓట్లే అడుగనని భీషణ ప్రతిజ్న చేశారు.
అదే ప్రతిజ్నను పదేపదే రాష్ట్ర మంత్రులు టీ హరీశ్ రావు, కల్వకుంట్ల తారక రామారావు, జూపల్లి క్రుష్ణారావు ప్రజల ముందు గుర్తు చేశారు. దేశంలో ఏ సీఎం చేయని ప్రతిజ్న చేశారని పదేపదే ప్రకటించుకున్నారు. కానీ ప్రస్తుతం పథకం అమలు తీరు మొదటి దశే పూర్తిగానీ పరిస్థితి నెలకొన్నది. ఇటువంటి తరుణంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 'మిషన్ భగీరథ' పథకం కింద ఇంటింటికి తాగు నీరు సరఫరా చేయకపోతే ఓట్లే అడుగనన్న సవాల్కు కట్టుబడి ఉంటారా? అని రాజకీయ విశ్లేషకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఇందూరులో ఆశించినస్థాయిలో జరుగని పనులు
కానీ మిషన్ భగీరథ సంస్థ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లాలో ప్రతిష్ఠాత్మకమైన మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను ఈ ఏడాదికి చివరి నాటికి పూర్తిచేసి ప్రతి ఇంటికి శుద్ధిచేసిన మంచినీరు అందించాలి. క్షేత్రస్థాయిలో పనుల తీరును మాత్రం ఆశించనంతగా స్పీడందుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి అంతర్గత గొట్టపు మార్గాల పనులు, నీళ్ల ట్యాంకుల నిర్మాణంలో తీవ్ర జాప్యం.. తొలి దశ పనులే ఇప్పటికీ పూర్తికాక గడువులోపు పనులు పూర్తవుతాయా? అని అనుమానిస్తున్నారు. ఆర్మూర్ పట్టణానికి తాగునీరందించడానికి ప్రత్యేకంగా టీఎస్ఎండీపీ ద్వారా చేపట్టిన పథకం పనులు గతేడాదే పూర్తి చేయాల్సి ఉండగా, వాటర్గ్రిడ్కు అనుసంధానించడంతో ప్రభుత్వం గడువు పొడిగించింది.
Recommended Video
పనుల్లో నిరంతర జాప్యం
గత ఏడాది వేసవిలో ఆర్మూర్కు తాగునీరందిస్తారని భావిస్తే నిరాశే మిగిలింది. మేలో సీఎం కేసీఆర్తో ప్రారంభించాలనుకున్నా పనులు సకాలంలో పూర్తికాక అసాధ్యంగా మారింది. మరోవైపు బాల్కొండలో నీటిశుద్ధి ప్లాంట్ నిర్మించారు. ట్రయల్రన్ విజయవంతమైనా తుదిదశ పనులు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచబ్యాంకు రుణసాయంతో చేపడుతున్న పట్టణంలో ఇంటింటికీ కుళాయిలు బిగించారు. మీటర్లు బిగించాల్సి ఉన్నా.. ఇంకా టెండర్ల దశలో ఉంది. 400 వాల్వ్ ఛాంబర్లు నిర్మించాల్సి ఉన్నా పనుల్లో జాప్యం జరుగుతోంది.
ఈ ఏడాది చివరిలోగా పూర్తి కావాల్సిన లక్ష్యాలు ఇవి
వాటర్గ్రిడ్ అధికారులు నీటిశుద్ధి ప్లాంట్ల నిర్మాణం, బ్యాక్వాష్ నీటి ట్యాంకుల నిర్మాణం, ప్రధాన గొట్టపు మార్గాల పనులను పర్యవేక్షిస్తుంటే, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గ్రామాల్లో నీటి ట్యాంకుల నిర్మాణం, అంతర్గత గొట్టపు మార్గాల పనులు పర్యవేక్షిస్తున్నారు. ఆర్మూర్ అర్బన్ పథకాన్ని ప్రజారోగ్యశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటి సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా దాదాపు రూ.1500 కోట్ల వ్యయంతో చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులు ఆశించినస్థాయిలో జరగడంలేదు. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా గొట్టపు మార్గాల కోసం చేపట్టిన తవ్వకాలే కనిపిస్తున్నా? నిర్దేశిత లక్ష్యాల సాధన దిశగా ముందుకు వెళ్లడం లేదని చెప్తున్నారు. శ్రీరాంసాగర్, సింగూర్ ప్రాజెక్టుల నుంచి జిల్లాలో 27 మండలాల పరిధిలోని 811 నివాస ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరా చేయాల్సి ఉంది. పనులు చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నది. ఈ ఏడాది చివరిలోగా వరకు పూర్తికావాలని గడువు విధించడంతో ఆరు నెలలుగా కొంత వేగం పుంజుకున్నాయి.
తొలి దశకే మోక్షం లేదు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టువద్ద ఇన్టెక్వెల్ నిర్మాణం పూర్తయ్యింది. తుదిదశ పనులు జరుగుతున్నాయి. జక్రాన్పల్లి మండలం అర్గుల్వద్ద ఒక నీటిశుద్ధి ప్లాంట్, ఇందల్వాయి మండల కేంద్రంలో మరో నీటిశుద్ధి ప్లాంట్ నిర్మాణాలు, బ్యాక్వాష్ నీటిట్యాంకుల నిర్మాణాలు సాగుతున్నాయి. నీటిశుద్ది ప్లాంట్ల నిర్మాణాలు పూర్తయినా, ప్రధాన గొట్టపు మార్గాల పనులు 80 శాతం వరకు పూర్తయ్యాయి. అంతర్గత గొట్టపు మార్గాలు, గ్రామాలలో నీటి ట్యాంకుల నిర్మాణంలో అంతులేని జాప్యం జరుగుతోంది. తొలి దశలో చేపట్టిన పనులే ఇంతవరకు పూర్తికాలేదు. తొలి దశలో ఆర్మూర్, బాల్కొండ, జక్రాన్పల్లి మండలాలలో చేపట్టిన పనులు జూన్లోపు పూర్తి కావాల్సి ఉండగా, పూర్తికాకపోవడంతో రెండు నెలల గడువు పెంచారు. వచ్చే ఆగస్టులోపు పూర్తి కావడం అనుమానమే. జిల్లాలోని మిగతా మండలాలలో రెండో దశలో 1500 కిలోమీటర్ల అంతర్గత గొట్టపు మార్గాలు వేయాల్సి ఉండగా, పనులింకా ప్రారంభమే కాలేదు. 541 నీటి ట్యాంకులలో వంద ట్యాంకుల నిర్మాణమే పూర్తయ్యింది. రెండో దశలో రెండులక్షల పదివేల కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంటే, ఒక్క కనెక్షన్ ఇవ్వలేదు. డిసెంబరు 31లోపు పనులు పూర్తికావలసి ఉండగా, పనులు జరుగుతున్న తీరు నిరాశాజనకంగా కనిపిస్తోంది.
నీటి ట్యాంకుల నిర్మాణం తీరిది
జిల్లాలోని 27 మండలాల పరిధిలో 449 గ్రామాల పరిధిలో నివాస ప్రాంతాలు 811 ఉన్నాయి. ఈ పథకం అమలులో జిల్లా పరిధిలో ఆర్మూర్, బోధన్ పట్టణాలు, నిజామాబాద్ నగరం కూడా వస్తాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుద్వారా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ స్థానాల పరిధిలో పంపిణీ చేస్తారు. సింగూర్ ప్రాజెక్టు నుంచి బోధన్ నియోజకవర్గంతోపాటు బాన్సువాడలో కొంత భాగంలో తాగునీటి సరఫరా జరుగుతుంది. తొలి దశలో ఆర్మూర్, జక్రాన్పల్లి, బాల్కొండ మండలాలలో 700 కిలోమీటర్ల దూరం అంతర్గత పైపులైన్లు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటికీ 400 కిలోమీటర్ల దూరం పూర్తయింది. రెండో దశలో 24 మండలాల్లో 1500 కిలోమీటర్ల పరిధిలో పనులు ప్రారంభమే కానేలేదు. ఆర్మూర్, జక్రాన్పల్లి, బాల్కొండ మండలాలలో నిర్మించాల్సిన 67 నీటి ట్యాంకులు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటికీ 40 ట్యాంకులు పూర్తయ్యాయి. మరో 27 ట్యాంకులు నిర్మాణంలో ఉన్నాయి. రెండో దశలో జిల్లాలోని మిగతా మండలాలలో 547 నీళ్ళట్యాంకులు నిర్మించాల్సి ఉన్నది. వీటి నిర్మాణానికి 480 ట్యాంకుల నిర్మాణానికి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదరగా, 100 ట్యాంకులు నిర్మాణంలో ఉన్నాయి. తొలి దశలో ఆర్మూర్, జక్రాన్పల్లి, బాల్కొండ మండలాలలో 49,461 కుళాయిలు బిగించడానికి 25,928 బిగించారు. రెండో దశలో జిల్లాలోని మిగతా మండలాలలో 2,10,000 కుళాయిలు బిగించాల్సి ఉన్నా ఒక్క కుళాయి కూడా బిగించలేదు.
కొరవడిన పర్యవేక్షణ.. ప్రణాళిక లేకుండా పనులు
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం డొర్లి గ్రామంలో మిషన్భగీరథ పనుల్లో భాగంగా గుంతలు తవ్వి పైపులు ఏర్పాటు చేసినా, వాటిని బిగించక గుంతను అలాగే వదిలేయడంతో ప్రమాదం పొంచి ఉంది. వర్షాలు కురుస్తుండటంతో నీరు చేరితే పొలం పనుల నిమిత్తం వెళ్లే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సక్రమంగా పైపులైన్లు బిగించకపోవడంతో ఇటీవల కురిసిన వర్షానికి భూమి కోతకు గురికావడంతో పైపులు బయటకొస్తున్నాయి. తాంసి మండలం హస్నాపూర్ గ్రామ శివారులో లస్మన్న అనేరైతు పొలం వెంబడి పైపులైన్ నిర్మాణం కోసం నెల రోజుల క్రితం తవ్వి గుంత పూడ్చకుండా వదిలేశారు. గుంత పూడ్చాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆయన వాపోతున్నారు.
బోథ్ మండలంలో పనులు ప్రారంభం ఇలా
ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 243పంచాయతీలల్లోని 1257 గ్రామాల పరిధిలో 5,91,805 జనాభాకు స్వచ్ఛమైన తాగు నీరందించేందుకు ప్రభుత్వం మొదటి రెండు విడతల్లో దాదాపు రూ.450 కోట్లు మంజూరు చేసింది. మూడేళ్ల క్రితం శ్రీకారం చుట్టిన ఈ పథకం కింద బోథ్ నియోజకవర్గంలో నీటి పంపిణీకి హెచ్ఎల్బీఆర్(భూ పైస్థాయి నిల్వట్యాంకు)ల నిర్మాణాలు చేపట్టారు. బోథ్ మండలంలోని కరత్వాడ, దేవుళానాయక్తండా, రతన్గూడలో చేపట్టారు. ఇచ్చోడ, అరెపెల్లి వద్ద నిర్మించి వాటి పరిధిలో 16 సంపులు నిర్మిస్తున్నారు. తలమడుగు మండలంలోని సుంకిడి, పల్సి(బి) తండా శివారులోని గుట్టలపైన, ఆదిలాబాద్ నియోజకవర్గంలోని మావల. చించుఘాట్, మొళాల్గుట్ట, మంగూర్ల గ్రామాల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. సరైన ప్రణాళిక లేకుండా పని నిర్వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. డిసెంబర్ నాటికల్లా ఇంటింటికి పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే పనుల పర్యవేక్షణ మాత్రం తీసికట్టుగా మారింది.
నాణ్యత లోపించిన పనులతో అంతా అస్తవ్యస్తం
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సుంకిడి, ఇచ్చోడ, బోథ్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు పనులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదార్లు ఇష్టారాజ్యంగా చేపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయా గ్రామాల ప్రజలు పనుల నిర్మాణాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటి నిర్మాణానికి సీసీరహదారులు సైతం అనుసంధానం చేయడంతో నాణ్యత లోపించాయి. పథకం ఉన్నతస్థాయి సమీక్షలో ఉపాధ్యక్షుడు వేముల ప్రశాంత్రెడ్డి గ్రామాల్లో పనులు చేపట్టక ముందు అవగాహన సదస్సులు, చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని, స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చేపట్టాలని ఆదేశించారు. కానీ ఇంత వరకు ఏ ఒక్క గ్రామంలోనూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు.