తెలంగాణకు గ్రేట్ న్యూస్... హ్యాపీనెస్ ఇండెక్స్లో చోటు... టాప్లో మిజోరాం...
చిన్న రాష్ట్రమే... కానీ సంతోష సూచికలో పెద్ద రాష్ట్రాల కంటే ముందుంది. దేశ హ్యాపీనెస్ ఇండెక్స్(సంతోష సూచిక)లో మిజోరాం అగ్ర స్థానంలో నిలిచింది. టాప్-10 జాబితాలో మరో రెండు ఈశాన్య రాష్ట్రాలు సిక్కీం,అరుణాచల్ ప్రదేశ్లకు కూడా చోటు దక్కింది. పెద్ద రాష్ట్రాల పరంగా టాప్-3లో తెలంగాణ రాష్ట్రానికి కూడా చోటు దక్కడం విశేషం.గురుగ్రామ్లోని మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ రాజేష్ కె పిలానియా ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ని రూపొందించారు. ఈ ఏడాది మార్చి-జులై మధ్యలో దేశవ్యాప్తంగా దాదాపు 16,950 మంది ప్రజల అభిప్రాయాలు సేకరించి రూపొందించిన సర్వే ఆధారంగా హ్యాపీనెస్ ఇండెక్స్ను ప్రకటించారు.
సర్వే ఆధారంగా ఇండెక్స్...
సర్వేలో ప్రధానంగా ఆరు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో పని,సంపాదన సంబంధిత సమస్యలు... కుటుంబం,స్నేహితులతో పాటు వృద్ది సంబంధాలు... మానసిక,శారీరక ఆరోగ్యం... మతపరమైన,ఆధ్యాత్మికపరమైన సామాజిక సమస్యలు,ఫిలాంత్రపీ,హ్యాపీనెస్పై కోవిడ్ 19 ప్రభావం వంటి అంశాలు ఉన్నాయి. వీటి ఆధారంగా రూపొందించిన హ్యాపీనెస్ ఇండెక్స్లో టాప్-3లో మిజోరాం,పంజాబ్ రాష్ట్రాలు అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతం నిలిచాయి.హ్యాపీనెస్ ఇండెక్స్ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి కూడా చోటు దక్కడం విశేషం. పెద్ద రాష్ట్రాల పరంగా చూసుకుంటే పంజాబ్,గుజరాత్,తెలంగాణ టాప్-3లో నిలిచాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్తో పాటు పుదుచ్చేరి,లక్షద్వీప్లకు కూడా ఇందులో చోటు దక్కింది.
ఆ అంశాల్లో సానుకూలత..
జాబితాలో పేర్కొన్న రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో వైవాహిక స్థితి, వయసు, విద్య, ఆదాయ స్థాయిల పరంగా సానుకూల వాతావరణం,సంతోషకర పరిస్థితులు ఉన్నట్లు వెల్లడైంది. అలాగే అవివాహితుల కంటే వివాహితులు సంతోషంగా ఉన్నారని తేలడం గమనార్హం. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అసిస్టెంట్ ప్రొఫెసర్, సమయం, డబ్బు,సంతోషాలకు సంబంధించిన అంశాలపై పరిశోధన చేస్తున్న ప్రముఖ స్కాలర్ డా.ఆష్లే విల్లన్స్ దీనిపై మాట్లాడుతూ... డబ్బు కంటే సమయానికి ఎక్కువ విలువనిచ్చేవారు మంచి జీవితాన్ని గడుపుతారని చెప్పారు.
Recommended Video
కరోనా ప్రభావం....
తాజా హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రకారం... ఢిల్లీ,మహారాష్ట్ర,హర్యానా రాష్ట్రాల్లో ప్రజల సంతోషంపై కరోనా తీవ్ర దుష్ప్రభావం చూపించింది. పుదుచ్చేరి,జమ్మూకశ్మీర్,మణిపూర్ రాష్ట్రాల్లో అక్కడి ప్రజల సంతోషంపై కరోనా ప్రభావం తటస్థంగా ఉంది. ఇక అండమాన్ నికోబార్,లక్షద్వీప్ రాష్ట్రాల్లోని ప్రజల సంతోషంపై అసలు కరోనా ప్రభావం పెద్దగా లేదు. అందుకే హ్యాపీనెస్ ఇండెక్స్లో ఈ కేంద్ర పాలిత ప్రాంతాలు టాప్లో నిలిచాయి. మొత్తంగా దేశంలోని ప్రజలు భవిష్యత్తుపై ఆశాజనకంగా ఉన్నట్లు ఈ ఇండెక్స్ వెల్లడించింది.