ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధికరెడ్డి కారు ప్రమాదానికి గురైంది.. ఆత్మహత్య కాదు: పోలీసులు
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధికరెడ్డి కారు ప్రమాదానికి గురైందని పోలీసులు తేల్చారు. ఈ నెల 17వ తేదీన కాకతీయ కెనాల్లో రాధిక రెడ్డి కారు కనిపించిన సంగతి తెలిసిందే. అందులో రాధికరెడ్డి, ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి, కూతురు ఉన్నారు. వారి మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉండగా.. మరునాడు అంత్యక్రియలను నిర్వహించారు. అయితే వారు కనిపించకుండా పోయి 20 రోజులు కావస్తోన్నా పోలీసు కంప్లైంట్ ఇవ్వకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఏం జరిగింది.. ఆత్మహత్య చేసుకున్నారా అనే సందేహాలు తలెత్తాయి.
కేసును విచారించిన పోలీసులు ప్రమాదవశాత్తు కాకతీయ కెనాల్లో కారు పడిపోయిందని చెప్పారు. రాధిక కుటుంబం ఆత్మహత్య చేసుకోలేదని వివరించారు. గత నెల 27వ తేదీన కారు కెనాల్లో పడిపోయిందని చెప్తున్నారు. అంతకుముందు రోజు బైక్ పడిపోవడంతో నీరు నిలిపివేయడంతో.. కారు బయటకు వచ్చింది. లేదంటే కారు అలానే ఉండిపోయేది.
పరాంకుశం వెంకటనారాయణ ప్రదీప్, కీర్తన అనే దంపతులు గత ఆదివారం రాత్రి కరీంనగర్ నుంచి గన్నేరువరం వెళ్తుండగా.. మార్గమధ్యలో ప్రమాదవశాత్తు అలుగునూరు కెనాల్లో పడిపోయారు. బైక్ లైట్ వెలుతురుకి భారీగా వచ్చిన పురుగులు ప్రదీప్ కళ్లల్లో పడటంతో.. ప్రమాదవశాత్తు బైక్ కాలువలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎల్ఎండీ పెట్రోలింగ్ పోలీసులు గుర్తించి.. ప్రదీప్ను కాపాడారు. అప్పటికే కీర్తన గల్లంతయ్యారు. దీంతో కీర్తన కోసం గాలించేందుకు అధికారులతో మాట్లాడి కాలువకు నీటిని నిలిపివేశారు. దీంతో మానకొండూరు మండలం ముంజపల్లి వద్ద ఆమె మృతదేహం లభ్యమైంది. కాలువలో నీరు తగ్గుముఖం పట్టడంతో.. అందులోనే సత్యనారాయణ రెడ్డి కారు బయటపడింది. ఈ నెల 27న ప్రమాదానికి గురైనట్టు పోలీసులు గుర్తించారు.