ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంట్లో విషాదం, కాకతీయ కెనాల్లో శవాలై తేలిన సోదరి కుటుంబం
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మనోహర్ రెడ్డి సోదరి రాధికరెడ్డి కుటుంబం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గత నెల 27వ తేదీన ఇంటినుంచి భర్త సత్యనారాయణ రెడ్డి, కూతురు సహస్ర కలిసి హైదరాబాద్ వెళ్తున్నామని చెప్పి బయల్దేరారు. కానీ వారి కారు కాకతీయ కెనాల్లో పడిపోయింది. అప్పటినుంచి వారి ఆచూకీ లేదు. రాధిక ఫ్యామిలీ ఎప్పుడూ తీర్థయాత్రలకు వెళ్తుందని.. ఇప్పుడు కూడా అలాగే వెళ్తుందని అనుకొన్నామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇలా వెలుగులోకి..
ఆదివారం మానేర్ డ్యాం నుంచి కారు పడిపోవడంతో పై నుంచి నీటిని ఆపివేశారు. దీంతో సోమవారం కారు కనిపించింది. ఆ కారు నంబర్ ఆధారంగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధికది అని గుర్తించారు. కారులో రాధిక, భర్త సత్యనారాయణ రెడ్డి, కూతురు సహస్ర ఉన్నారు. గత 20 రోజుల నుంచి కెనాల్లో పడి ఉండటంతో మృతదేహాలు కుళ్లిపోయి ఉన్నాయి.
ఫిర్యాదు లేదు..
ఘటనాస్థలానికి కరీంనగర్ కలెక్టర్, పోలీసు కమిషనర్ కమలహాసన్ రెడ్డి చేరుకొన్నారు. ప్రమాదం గురించి ఆరా తీశారు. రాధిక కుటుంబం మిస్సింగ్ అని తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీపీ కమలహాసన్ రెడ్డి పేర్కొన్నారు. ఘటనాస్థలానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చేరుకొన్నారు. ఘటన తమ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని పేర్కొన్నారు. తమకు ఎలాంటి విభేదాలు లేవని, ఆర్థిక ఇబ్బందులు కూడా లేవని చెప్పారు.
మెడిసిన్ చేస్తోన్న సహస్ర..
రాధిక టీచర్గా పనిచేస్తోండగా.. సహస్ర మెడిసిన్ చదువుతోన్నారు. వారు తరచూ విహార యాత్రకుల వెళ్లారని.. ఇప్పుడు కూడా అలానే వెళ్లారని అనుకొన్నామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. రాధిక ఫ్యామిలీ కారు ప్రమాదానికి గురైందా..? లేదంటే కుట్రకోణం ఉందా అనే అంశం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.