సీఎం మాటంటే శాసనం... అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను కేసీఆర్ నిలబెట్టుకుంటారా లేదా..: జగ్గారెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్వయంగా సీఎం కేసీఆరే ఇక్కడి ప్రజలకు ఆ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ సంగారెడ్డిలో టీఆర్ఎస్ ఓడిపోయాక ఆ ప్రతిపాదనను మంత్రి హరీష్ రావు సిద్దిపేటకు తీసుకెళ్లారని విమర్శించారు. ముఖ్యమంత్రి మాటంటే శాసనమని... ఆయన మాటిస్తే జరిగి తీరాలని... మరి కేసీఆర్ తన మాట నిలబెట్టుకుంటారా లేదా అని ప్రశ్నించారు. కొత్త సంవత్సరంలో జనవరి నెలలో మెడికల్ కాలేజీకి సంబంధించిన జీవో ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.
ఢిల్లీలో ఆ విషయం అడిగారా...
ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ తెలంగాణలో మెడికల్ కాలేజీల ఏర్పాటు అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించారా లేదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కేంద్రం మంజూరు చేయాల్సిన మెడికల్ కాలేజీలపై ఫాలో అప్ చేస్తున్నారా అని నిలదీశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కాకపోతే ఇక ఢిల్లీకి ఎందుకు వెళ్లినట్లో తనకైతే అర్థం కావట్లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సంగారెడ్డిలో సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని అన్నారు. ఇందుకోసం రూ.1వెయ్యి కోట్లు మంజూరు చేయాలన్నారు.
అసెంబ్లీ సాక్షిగా
మెడికల్ కాలేజీ విషయంలో రాజకీయానికి తావు లేదని... సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధిగా కోరుతున్నానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశంలోనే మెడికల్ కాలేజీ అంశాన్ని సభలో తాను ప్రస్తావించినట్లు జగ్గారెడ్డి గుర్తుచేశారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించి కాలేజీ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు. రెండో సారి జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ మంత్రి ఈటల రాజేందర్ దీనిపై హామీ ఇచ్చారని... కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారన్నారు.
ఫిబ్రవరి నుంచి పోరాటమే..
మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం లేకున్నా ఫర్వాలేదని... తన పేరు శిలా ఫలకంపై లేకున్నా ఫర్వాలేదని కాలేజీ మాత్రం ఏర్పాటు చేయాలని జగ్గారెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలోనూ ఈ అంశాన్ని తాను కూడా వాడుకోనని చెప్పారు. ఓవైపు ప్రధాని మోదీ జమిలి ఎన్నికలు అంటున్నారని... అదే జరిగితే ఇంకా ఏడాది కాలమే సమయం ఉంటుందని... ఈలోగా మెడికల్ కాలేజీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మాట్లాడేందుకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా కోరుతానని అన్నారు. జిల్లాకు చెందిన మిగతా ఎమ్మెల్యేలు,ఎంపీ దీనిపై మాట్లాడరా అని ప్రశ్నించారు. జనవరిలో మెడికల్ కాలేజీపై ప్రకటన రాకపోతే ఫిబ్రవరి నుంచి దీనిపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. గజ్వేల్,సిద్దిపేట మాదిరి సంగారెడ్డిని కూడా పట్టించుకోవాలని కోరారు. సీఎం నుంచి సానుకూల స్పందన రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.