నాగిరెడ్డి కమిషనరా? టీఆర్ఎస్ కార్యకర్తా? ఎన్నికల అధికారిపై జగ్గారెడ్డి ఫైర్
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలపై ఓటరు జాబితా విడుదల కాకముందే టీఆర్ఎస్ నాయకుల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే నాగిరెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తనా... లేక ఎన్నికల కమిషనర్గా ఉన్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల షెడ్యుల్పై కేంద్ర ఎన్నికల కమీషన్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.
ఎన్నికల కమీషన్, పోలీసులు ప్రభుత్వానికి పూర్తి సహాకారం
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు షెడ్యుల్ విడుదలైన సంధర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, ఎన్నికల కమీషన్తో పాటు పోలీసులను అడ్డుపెట్టుకుని మున్సిపాలిటీల్లో అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తుందని, ఇందుకోసం వారుకూడ సహకరిస్తున్నారని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రజలంతా సంక్రాంతి పండగా జరుపుకోనున్న నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యుల్ ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. ప్రజలకు కనీసం పండగలను కూడ జరుపుకోకుండా హడావుడిగా షెడ్యుల్ విడుదల చేశారని అన్నారు.
టీఆర్ఎస్ అన్ని సర్దుకున్న తర్వాతే నోటిఫికేషన్
కాగా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన డబ్బు , సరంజమా అంతా కార్యకర్తలకు, నాయకులు చేరిన తర్వాత పండగ ముందు ఎన్నికలు జరిపేందుకు షెడ్యుల్ విడుదల చేశారని ఆయన ఆరోపణ చేశారు. మరోవైపు ఓటర్ల జాబితా విడుదల చేయకపోవడంతో పాటు రిజర్వేషన్ల ప్రక్రియ కూడ ఇంకా పూర్తి కాలేదని, అయినా షెడ్యుల్ విడుదల చేశారని ఆయన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే షెడ్యుల్పై అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు, అందుకే సెంట్రల్ ఎలక్షన్ కమీషన్కు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షున్ని కోరానని చెప్పారు.
నాగిరెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు
ప్రస్తుతం ఉన్న ఎన్నికల కమీషనర్లపై నమ్మకం పోతుందని ఆయన ఈ సంధర్భంగా వాపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమీషన్ ఎప్పుడు ప్రజలకు అనుగుణంగా ఎన్నికలను నిర్వహంచిందని, కాని ప్రస్తుతం ఉన్న కమీషనర్ టీఆర్ఎస్ కార్యకర్తల ఆదీనంలో పనిచేస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే కమీషనర్ నాగిరెడ్డి ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా పని చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడ ఎన్నికల కమీషన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే నాగిరెడ్డి ఎన్నికల కమీషనరా...లేక టీఆర్ఎస్ కార్యకర్త అంటూ ఆయన ప్రశ్నించారు.
నాగిరెడ్డికి ఫిర్యాదు చేసిన కాంగ్రస్ బృందం
కాగా అంతకు ముందే ఎన్నికల షెడ్యుల్ విడుదల చేయడంపై రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీ బృందం కలిసింది. అనంతరం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది. అధికారులు ప్రభుత్వానికి ఏజెంట్స్గా మారుతున్నారని బృందం ఆరోపణలు చేసింది. రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిగా ప్రకటించకముందే... షెడ్యుల్ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంధర్భంగా కోర్టుకు సైతం వెళతామని చెప్పారు.