ఒక్కడి ఇమేజ్ కోసం తొక్కే ప్రయత్నం : పార్టీలో సింగిల్ హీరో కుదరదు : రేవంత్ పై జగ్గారెడ్డి ఫైర్..!!
టీపీసీసీ చీఫ్ రేవంత్ కు వ్యతిరేకంగా కొందరు సీనియర్లు ఏకం అవుతున్నారు. రేవంత్ కు పీసీసీ ఖరారు చేస్తూ ప్రకటన రాగానే..ఎంపీ కోమటిరెడ్డి విరుచుకుపడ్డారు. టీడీపీ నుంచి వచ్చిన వారికి పీసీసీ అప్పగించారని.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ పీసీసీ అమ్ముకున్నారంటూ సంచలన ఆరోపణలు చేసారు. రేవంత్ పీసీసీ ఇవ్వటానికి అప్పటి వరకు వ్యతిరేకించిన సీనియర్ నేత వీహెచ్ ఆ తరువాత సైలెంట్ అయ్యారు. ఇక, రేవంత్ పార్టీలో సంప్రదాయ ఓట్ బ్యాంకు పైన ఫోకస్ పెట్టారు.
అందులో బాగంగా దళిగ- గిరిజన సభలు నిర్వహిస్తున్నారు. సీనియర్లకు గౌరవం ఉంటుందనే అభిప్రాయం కలిగిచేందుకు గతం కంటే భిన్నంగా పీఏసీ కమిటీ సైతం ఏర్పాటు చేసారు. అయితే, రేవంత్ పైన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలోనూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి తో నేరుగా అందరినీ కలుపుకొని పోవాలంటూ తేల్చి చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ను గాంధీ భవన్ కు ఆహ్వానించాలని సూచించారు. అయితే, కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను రేవంత్ ప్రస్తావించారు.
ఇవన్నీ కాంగ్రెస్ లో సహజమని..ఇటువంటివి జరుగుతూనే ఉంటాయని తేల్చి చెప్పారు. ఇక, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి మందు జగ్గారెడ్డి మరోసారి రేవంత్ రెడ్డి పైన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్లో సింగిల్ హీరో కుదరదు.. ఒక్కడి ఇమేజ్ కోసం మిగతా వారిని తొక్కే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ది పార్టీనా లేదా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీనా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీలో చర్చించకుండా ముందే ప్రోగ్రాంలు ఫిక్స్ చేయడమేంటని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
కాంగ్రెస్లో అందరూ ఒకటే.. ఒక్కరే స్టార్ అనుకుంటే కుదరదని జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. సంగారెడ్డికి పీసీసీ వస్తే .. తనకు సమాచారం ఇవ్వరా.. ఈ మాత్రం ప్రోటోకాల్ కూడా తెల్వదా అంటూ మండి పడ్డారు. జగ్గారెడ్డికి , రేవంత్ రెడ్డికి విభేదాలు ఉన్నట్లు రేవంత్ పరోక్షంగా చెబుతున్నారా అంటూ నిలదీసారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాకముందు.. తాను మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యానని జగ్గారెడ్డి గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల వేళ..అందునా సీఎల్పీ సమావేశం సమయంలో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారాయి.
దీని పైన రేవంత్ మద్దతు దారులు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. అయితే, జగ్గారెడ్డి వ్యాఖ్యలను ఆ సమయంలో ఉన్న పార్టీ సీనియర్ నేతలు..ఎమ్మెల్యేలు తప్పు పట్టకపోవటం ఇప్పుడు కీలక అంశంగా పరిగణిస్తున్నారు. జగ్గారెడ్డి వ్యవహారంలో ఇప్పుడు రవేంత్ వైఖరి ఏంటనేది స్పష్టం కావాల్సిన అవసరం ఉంది.