అధ్వానంగా తెలంగాణాలో పరిస్థితులు ... అసెంబ్లీలో నిలదీస్తాం : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సెప్టెంబర్ 7వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇటీవల ప్రగతి భవన్ లో అసెంబ్లీ సమావేశాలపై చర్చించిన సీఎం కేసీఆర్ ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఇక రానున్న అసెంబ్లీ సమావేశాలలో అధికార పక్షాన్ని టార్గెట్ చేయాలని ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా వ్యూహాత్మకంగా సిద్ధమౌతున్నారు.
రాయలసీమ ఎత్తిపోతలపై విచారణ నిరవధిక వాయిదా వేసిన తెలంగాణా హైకోర్టు ... కారణం ఇదే !!
ప్రజా సమస్యలపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో తాజా పరిస్థితులపై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గటం లేదని, ప్రభుత్వ ఆసుపత్రులలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు . ప్రభుత్వ ఆసుపత్రులలో అధ్వాన పరిస్థితి పై అసెంబ్లీలో నిలదీస్తామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. కనీస సదుపాయాలు కూడా లేని పరిస్థితుల్లో ఆసుపత్రులు ఉన్నాయని ఆయన విమర్శలు గుప్పించారు.
వెంటిలేటర్లు ఆక్సిజన్ సదుపాయాలు లేక కరోనా రోగులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ప్రభుత్వాసుపత్రుల పర్యటనపై లేనిపోనివి సృష్ట్టించవద్దని కోరారు.దీనిపై మాట్లాడిన జగ్గారెడ్డి పీసీసీ చీఫ్, ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాతనే భట్టి విక్రమార్క జిల్లాల పర్యటనలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితులను పరిశీలించి, ప్రజలకు కలుగుతున్న అసౌకర్యంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి, ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవటానికి ఆయన పర్యటిస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ప్రభుత్వ ఆసుపత్రుల పర్యటన చెయ్యాలని భావించినప్పటికీ, కరోనా కారణంగా భట్టి విక్రమార్క ఒక్కరే ఆసుపత్రుల పరిశీలనకు వెళుతున్నారని పేర్కొన్నారు. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులలో విభేదాలు ఉన్నట్లుగా, భట్టి జిల్లాల పర్యటనపై భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.