రైతులకు నయవంచన, చనిపోతే పథకాలా..? కేసీఆర్పై జగ్గారెడ్డి ధ్వజం..
సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. రైతులను నయవంచన చేస్తుందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా రోజూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గుర్తుచేశారు. ఇదీ చేతగానితనానికి నిదర్శనం అని ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యల అంశం కలచి వేస్తోందని.. కానీ సీఎం కేసీఆర్ మాత్రం పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు.
రైతు ఆత్మహత్యలకు సంబంధించి పత్రికల్లో వార్తలు వస్తున్నాయని.. కానీ ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం చూపడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదన్నారు. చనిపోయిన రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పథకం పెట్టిందని ధ్వజమెత్తారు. రైతు బతకడానికి స్కీమ్ పెట్టలేదని విమర్శించారు. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. కానీ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని టీఆర్ఎస్ చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోన్నా రుణమాఫీ ఊసే ఎత్తలేదని దుయ్యబట్టారు.
రైతులను మభ్యపెడుతూ కేసీఆర్ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. రైతులకు ఇబ్బంది ఉంటే ప్రభుత్వం వద్దకు వెళ్తారని తెలిపారు. రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉందని.. అందుకే ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల వద్దకు వెళ్తుందని మండిపడ్డారు. రైతుల శాపం తగిలి ఏదో ఒక రోజు కేసీఆర్ కుటుంబం పతనమవుతుందని జోస్యం చెప్పారు.
రైతులకు ఎకరాకు రూ. 20 వేల చెప్పున అన్ని పంటకు నష్టపరిహారం ఇవ్వాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. రెండు, మూడు రోజుల్లో సంగారెడ్డి రైతులతో కలిసి ప్రగతి భవన్ ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామనే హామీని కూడా నిలబెట్టుకోలేదని విరుచుకుపడ్డారు. ప్రభుత్వ సూచనల మేరకే రైతులు పంట వేశారని తెలిపారు.