హిజ్రాలను మనుషుల్లా చూడట్లేదు.. వాళ్లకూ పెన్షన్ ఇవ్వాలి: కొండా సురేఖ
హిజ్రాలను ఒంటరి స్త్రీలుగా గుర్తించి వారికి పెన్షన్ అందజేయాలని ఎమ్మెల్యే కొండా సురేఖ కోరారు.
హైదరాబాద్: సమాజంలో మూడవ తరగతి ప్రజలుగా బ్రతుకు పోరాటంలో హిజ్రాలు ఎదుర్కొనే సమస్యలు అనేకం. సామాజికంగా.. రాజకీయంగా.. ఏవిధంగా చూసుకున్నా.. ఎందులోను వారికి తగిన ప్రాధాన్యం లేదు. కనీస తిండికి, బట్టకు నోచుకోని స్థితిలో చాలామంది హిజ్రాలు అత్యంత ధీనంగా కాలం వెళ్లదీస్తున్నారు.
తాజాగా హిజ్రాల సమస్యలను అసెంబ్లీలో చర్చకు లేవనెత్తారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ. హిజ్రాలను సమాజం కనీసం మనుషులుగా కూడా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లెంత పెద్ద చదువులు చదివినా.. ఎవరూ ఉద్యోగాలు మాత్రం ఇవ్వట్లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో భిక్షాటన చేస్తూ బ్రతుకుతున్నారని అన్నారు.
ఎన్నికల ప్రచారాల్లో సైతం హిజ్రాలు పాల్గొనడాన్ని ఈ సందర్బంగా సురేఖ గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలోను హిజ్రాలు కీలక పాత్ర పోషించారని, కానీ సమాజం వారిని నిరాధారణకు గురిచేస్తోందని తెలిపారు.
ఇటీవల ఒంటరి స్త్రీలకు ప్రభుత్వం రూ.వెయ్యి పెన్షన్ ప్రకటించిన నేపథ్యంలో.. హిజ్రాలను ఒంటరి స్త్రీలుగా గుర్తించి వారికి పెన్షన్ అందజేయాలని కోరారు. హిజ్రాలకు జీవనోపాధి చూపించే ప్రయత్నం చేయాలన్నారు.
కొండా సురేఖ మాట్లాడిన తర్వాత దీనిపై మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. ఈ విషయాన్ని సీఎంతో చర్చించి సరైన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.