ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కరోనా ... టీఆర్ఎస్ లో వరుసగా కోవిడ్ బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులను కరోనా మహమ్మారి వదలడం లేదు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలపై కరోనా పంజా విసురుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుటుంబం కూడా కరోనా బారిన పడగా, మంత్రి మల్లారెడ్డి తో పాటు ఆయన భార్య కూడా కరోనా బారిన పడి తిరిగి కోలుకున్నారు .
కరోనాతో జగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతి .. మేడారం జాతరలో కీలకంగా, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా..
ఇక తాజాగా సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే , టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు కోనేరు కోనప్ప కరోనా బారిన పడ్డారు . అనారోగ్యంతో ఉన్న ఆయన ర్యాపిడ్ టెస్టులు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికారులు చెప్తున్నారు. ఆయనతో పాటు ఆయన భార్యకు కూడా కరోనా సోకినట్టు తెలుస్తుంది. దీంతో ఆయన, ఆయన సతీమణి కరోనా వైరస్ నివారణ కోసం చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ రావటంతో ఇటీవల ఆయనతో సన్నిహితంగా ఉన్న వారు సైతం పరీక్షలు చేయించుకుంటున్నారు . వారంతా హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు చెప్తున్నారు .
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నకేసులతో ప్రజలు బెంబేలు పడుతున్నారు. కరోనా కేసుల తీరు తెలంగాణ వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 1.11 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా నిన్న ఒక్క రోజే 3,018 కేసులు నమోదు అయ్యాయి . నిన్న మరణాలను చూస్తే 10 మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 780కి చేరింది . కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 1,060 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 85,233కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 25,685 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 10,82,094కి చేరింది.