మహిళల బతుకమ్మతో చెలగాటం: కలెక్టర్ చెప్పినా.. ముత్తిరెడ్డి తగ్గట్లేదు?
వివాదాస్పద భూమిలో అధికారిక కార్యక్రమాలు నిర్వహించేది లేదని కలెక్టర్ చెబుతున్నారు.
జనగాం: జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టర్ దేవసేన, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిల మధ్య బతుకమ్మ కుంట వివాదం ముదురుతోంది. వివాదాస్పద భూమిలో అధికారిక కార్యక్రమాలు నిర్వహించేది లేదని కలెక్టర్ చెబుతుండగా.. బతుకమ్మ కుంటలోనే బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు ఎమ్మెల్యే సిద్దమయ్యారు.
ఇద్దరిలో ఎవరూ వెనక్కి తగ్గకపోవడటంతో వివాదం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. బతుకమ్మ కుంట కబ్జాలో ఉండటం వల్ల.. సుప్రీం కోర్టు ఆదేశానుసారం అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు సమంజసం కాదనేది కలెక్టర్ వాదన.
రాద్దాంతం వద్దు, జరిగింది అదే!: తేలనివ్వండి, ముత్తిరెడ్డిని వణికిస్తున్న కలెక్టర్..
మరోవైపు ఎమ్మెల్యే మాత్రం కలెక్టర్పై పైచేయి సాధించడానికైనా బతుకమ్మ వేడుకలు అక్కడే జరిపించాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే కలెక్టర్పై ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది.
కాగా, బతుకమ్మ వేడుకల కోసం కలెక్టర్ ఇప్పటికే వానాపురం చెరువు ప్రదేశంలో బతుకమ్మ వేడుకల కోసం ఏర్పాట్లు చేయించారు. కలెక్టర్కు పోటీగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూడా బతుకమ్మ కుంటలో ఏర్పాట్లు చేయిస్తున్నారు. దీంతో రెండింటిలో ఎక్కడికెళ్లి బతుకమ్మ ఆడాలనే దానిపై మహిళల్లోను సందేహం నెలకొంది.
కలెక్టర్ మాత్రం వివాదాస్పద భూమిలో అధికారిక కార్యక్రమాలను ప్రోత్సహించేది లేదని తెగేసి చెబుతున్నారు. ఈ విషయం ఇప్పటికే సీఎం కేసీఆర్ వద్దకు కూడా చేరింది. రెండు రోజుల క్రితమే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బతుకమ్మ కుంటను సందర్శించినా.. వివాదానికి మాత్రం తెరపడలేదు.