పార్టీలో సీనియర్ ని అయినా .. కొత్తగా వచ్చిన వారికే మంత్రి పదవులు : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కామెంట్స్
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీలో సీనియర్ గా ఉన్నా తనకు మంత్రి పదవి రాలేదని, తన తర్వాత పార్టీ లోకి వచ్చిన ఎంతో మందికి మంత్రి పదవులు వచ్చాయని ఆయన ఓ సమావేశంలో కార్యకర్తల ముందు వాపోయారు. కొత్తగా వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని పేర్కొన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు, నేతలకు సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని చెప్తూనే తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి .. టార్గెట్ టీఆర్ఎస్ .. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు వీరే
పార్టీలో సీనియర్ గా ఉన్నా మంత్రి పదవి ఇవ్వలేదు
జనగామ నియోజకవర్గంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నిన్న, మొన్న వచ్చిన వారికి మంత్రి పదవులు వచ్చాయని, పార్టీలో సీనియర్ గా ఉన్న తనకు ఇంతవరకూ మంత్రి పదవి రాలేదని పేర్కొన్నారు. అయినా తానేమీ బాధపడటం లేదని పేర్కొన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సీఎం కేసీఆర్ కు, పార్టీకి విధేయుడిగా నమ్మకం గా పనిచేస్తూ వస్తున్నానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో పార్టీ శ్రేణులు చెప్పిందే తనకు వేదమని పేర్కొన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పార్టీ కార్యకర్తలు సూచించిన వారికే ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
విధేయుడ్ని అంటూనే అసహనం ప్రదర్శించిన ముత్తిరెడ్డి
సీఎం కేసీఆర్ వల్లే తాను ఎమ్మెల్యేగా ఉన్నానని గుర్తు చేసిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఉంటుందని పేర్కొన్నారు. ఒకపక్క టీఆర్ఎస్ పార్టీకి ,ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల విధేయతను ప్రదర్శిస్తూనే సీనియర్ అయినప్పటికీ తనకు మంత్రి పదవి ఇవ్వలేదంటూ తన అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. తన కంటే వెనుక పార్టీలోకి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా అవకాశం ఇవ్వడం, ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లాలో పెత్తనం చెలాయించడం నచ్చకనే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని స్థానికంగా చర్చ జరుగుతుంది.
టీఆర్ఎస్ లోనూ , రాజకీయ వర్గాల్లోనూ ముత్తిరెడ్డి వ్యాఖ్యలపై చర్చ
వర్ధన్నపేట, ఉప్పల్, జనగామ నియోజకవర్గాలలో పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, టిఆర్ఎస్ అభివృద్ధికి తన వంతు ప్రయత్నం చేశానని, అయినా తనకు మంత్రిగా అవకాశం రాలేదని ముత్తిరెడ్డి చేసిన వ్యాఖ్యలు టిఆర్ఎస్ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ఏదేమైనప్పటికీ ముత్తిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. మంత్రి పదవి ఇవ్వని కారణంగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నారని ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది.