బిల్ కలెక్టర్ అవతారమెత్తిన టిఆర్ఎస్ఎమ్మెల్యే: 2గంటల్లో రూ.70వేలు వసూల్
వరంగల్: స్వచ్ఛ చేర్యాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సమయంలో.. పంచాయతీకి రూ. 3.86 లక్షల మొండి బకాయి రావాల్సి ఉందని తెలుసుకుని మండిపడ్డారు టిఆర్ఎస్ జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. తర్వాత సర్పంచ్ ముస్త్యాల అరుణ అధ్యక్షతన గ్రామపంచాయతీలో అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పంచాయతీకి సంబంధించిన 48 షట్టర్లకు నెలవారి కిరాయిలు రూ. 3,86,100 మొండి బకాయిలుగా మారాయని సభ దృష్టికి వచ్చింది. స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డియాదగిరిరెడ్డి రంగంలోకి దిగారు.
వెంటనే బిల్ కలెక్టరు అవతారం ఎత్తి, ప్రజా ప్రతినిధులు, పోలీసులను వెంటబెట్టుకుని ఒక్కో దుకాణం వద్దకూ వెళ్లి పన్నులను చెల్లించాలని కోరారు.
అంతటితో ఆగకుండా రెండు గంటల్లో రూ. 70 వేలకు పైగా పన్ను వసూలు చేశారు. పన్ను చెల్లింపులపై ఇబ్బందులు పెడుతున్న వారి షట్టర్లకు తాళాలు వేయించారు. మిగిలిన బకాయిలను సైతం తానే వసూలు చేసి పంచాయతీకి ఇస్తానని హామీ ఇచ్చారు.