ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోలింగ్ .. ఓటేయ్యద్దంటూ కాంగ్రెస్, టీడీపీ విప్ జారీ
హైదరాబాద్ : తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ కలిగిస్తోంది. మొత్తం ఐదు స్థానాల్లో అధికార టీఆర్ఎస్ కూటమి బరిలోకి దిగింది. కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరడంతో ఆ పార్టీ బలం తగ్గిపోయింది. బరిలో నిలిపిన గూడురు నారాయణరెడ్డి కూడా బరిలో ఉండరని, నిన్న కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది. టీఆర్ఎస్ వైఖరిని ఎండగడుతున్న కాంగ్రెస్ వ్యుహత్మక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సభ్యులెవరూ ఓటు వేయొద్దని విప్ జారీచేసింది. టీడీపీ కూడా విప్ జారీచేయడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ఓటుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
పకడ్బందీగా టీఆర్ఎస్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ తమ అభ్యర్థులు నలుగురు, ఎంఐఎం అభ్యర్థి గెలిపించుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ఇందులో భాగంగానే ఆత్రం సక్కు, రేగా కాంతారావు, హరిప్రియ, సబితా ఇంద్రారెడ్డి, సండ్ర వెంకట వీరయ్య పార్టీ వీడి .. కారెక్కేందుకు కారణమైంది. వాస్తవానికి ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లో నలుగురు సభ్యులు గెలిచేందుకు టీఆర్ఎస్ కు బలం ఉంది. కానీ వలసలతో ఆ పార్టీ సంఖ్య పెరిగింది. వీరి చేరికతో కూడా 103కి చేరింది. కానీ ఐదు ఎమ్యెల్సీ స్థానాలు గెలువాలంటే మరో ఇద్దరు సభ్యుల ఓటు తప్పనిసరి. రెండో ప్రాధాన్య ఓటుతో గెలువొచ్చు. కానీ మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలువాలని కేసీఆర్ భావిస్తోన్నందున ఆ ఇద్దరు ఎవరనే చర్చ జరుగుతోంది.
అసెంబ్లీలో పోలింగ్
ఐదు స్థానాలకు జరుగుతున్న పోలింగ్ కోసం ఇప్పటికే అసెంబ్లీలో ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంది. బ్యాలెట్ పద్ధతిలో జరిగే పోలింగ్ కోసం .. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అవగాహన కల్పించింది. నిన్న తెలంగాణ భవన్ లో నిపుణులతో అవగాహన కల్పించిన తర్వాత మాక్ పోలింగ్ కూడా నిర్వహించింది. సీఎం కేసీఆర్ సహా ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఇవాళ ఉదయం 8.30 గంటలకు ప్రగతిభవన్ కు ఎమ్మెల్యేలంతా రావాలని కేసీఆర్ ఆదేశించారు. ఇక్కడ మరోసారి మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఎమ్మెల్యేలు ఎక్కడ తడబడకుండా ఉండేందుకు పోలింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. తర్వాత అక్కడినుంచి నేరుగా బస్సుల్లో అసెంబ్లీకి వెళ్లి .. ఓటు హక్కు వినియోగించుకుంటారు ఎమ్మెల్యేలు.
ఇది నాకు లభించిన అత్యున్నత గౌరవం..పద్మభూషణ్ అవార్డుపై మోహన్ లాల్
ఎన్నికలు బహిష్కరణ
అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రలోభాల పర్వంతో విసిగి వేసారిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించినట్టు పేర్కొంది. అలాగే తమ పార్టీ సభ్యులు ఓటు వేయరాదని విప్ జారీచేసింది. ఒకవేళ గోడదూకిన నేతలు ఓటు వేస్తే .. వారిపై ప్రజా ప్రాతినిథ్య చట్టం కింద కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. కానీ గతంలో కూడా కోర్టును ఆశ్రయించిన సందర్భాలు ఉన్నాయి.