నన్ను చంపేందుకు రాళ్ల దాడి: బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్, బాబుకు దత్తాత్రేయ పిలుపు
హైదరాబాద్: తనను హతమార్చేందుకు ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నుతున్నాయని, ఆదివారం నాడు తెల్లవారుజామున తన పైన దాడి జరిగిందని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ అన్నారు.ఆదివారం ఆయన గోషామహల్లోని తన కార్యాలయంలో మాట్లాడారు.
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో మాతా విశాల్ జాగారణ్ కార్యక్రమాలలో పాల్గొని ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కార్వాన్ నుంచి మంగళ్ హాట్లోని ఇందిరా నగర్కు వెళ్తున్నానని, ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తన కాన్వాయ్ పైన రాళ్లతో దాడికి పాల్పడినట్లు తెలిపారు.
ఆ సమయంలో తన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించారని, దీంతో ప్రామాదం తప్పిందన్నారు. ఈ ఘటన పైన డిజిపికి లేఖ రాసినట్లు రాజాసింగ్ లోథ్ చెప్పారు.
అలయ్-బలయ్కు చంద్రబాబును ఆహ్వానించిన దత్తాత్రేయ
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా తాను నిర్వహించే అలయ్ - బలయ్ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. అమరావతి శంకుస్థాపనకు రావాల్సిందిగా దత్తాత్రేయను చంద్రబాబు ఆహ్వానించారు.
ఎస్బీహెచ్ ప్రధాన కార్యాలయం వద్ద తెదేపా, బిజెపి ధర్నా
ఒకేసారి రైతు రుణమాఫీ డిమాండ్తో హైదరాబాద్లోని ఎస్బీహెచ్ ప్రధాన కార్యాలయం వద్ద టిడిపి, బిజెపి చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. ధర్నాలో పాల్గొనేందుకు నగరం సహా పలు జిల్లాల నుంచి తరలివస్తున్న కార్యకర్తలు, రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరిపై నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని కోరితే ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ పాలన ఏకపక్షంగా సాగుతోందని, రైతు సమస్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న నిర్మాణాత్మక సూచనలను సైతం పట్టించుకోవడం లేదన్నారు.
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న ఎర్రబెల్లి
ఫిరాయింపుదార్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర రావు నిర్ణయించారు. బుధవారం నాడు ఈ పిటిషన్ను ఆయన దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఫిరాయింపుదార్లపై వేటు పడేంత వరకు తన పోరాటం ఆగదన్నారు. ఉద్యమం జరుగుతున్న సమయంలో పలు స్థానాల్లో ఉపఎన్నికల కోసం ఆరాటపడిన టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు అదే ఎన్నికలపై ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. టీఆర్ఎస్కు ఓటమి భయం పట్టుకుందన్నారు.