కేసీఆర్! అంతా మీ వల్లే: పేదల బాధ చూడలేక పదవికి రాజాసింగ్ రాజీనామా!
గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ లోధ్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు బహిరంగ లేఖ రాశారు.
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ లోధ్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు బహిరంగ లేఖ రాశారు.
దూల్పేటలో గుడుంబా అరికడుతున్నందుకు పేదలకు పునరావాసం, ఉపాధి కల్పించాలని లేఖలో కోరారు. దూల్పేటలో సీఎం కేసీఆర్ పర్యటించి సమస్యలు తెలుసుకోవాలన్నారు.
పేదరికాన్ని చూడలేకపోతున్నానని, కొందరు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని రాజాసింగ్ లోధ్ పేర్కొన్నారు.
దీనికి అంతటికి మీ పాలనే కారణమన్నారు. పరిస్థితిని చూడలేక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తన రాజీనామాను ఆమోదించాలని ఆ లేఖలో రాజాసింగ్ పేర్కొన్నారు.
దూల్ పేట ప్రజలకు మంచి చేస్తానని సీఎం చెప్పారని, కానీ ఇచ్చిన మాట తప్పారని రాజాసింగ్ ఆరోపించారు. సీఎం మాట విని అందరు సారా వ్యాపారం మాని, ఇప్పుడు రోడ్లపైకి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లకు ప్రత్యామ్నాయం దొరకలేదన్నారు. తనకు ఓటర్ల నుంచి ఒత్తిడి వస్తోందన్నారు. మంత్రులు,అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.