ఎఫ్ఆర్వో అనితపై ఎమ్మెల్యే సోదరుడి దాడికేసు.. సుప్రీంకోర్టు ఎంత తీవ్రంగా స్పందించిందంటే
ఎఫ్ఆర్వో అనితపై ఎమ్మెల్యే సోదరుడి దాడికేసులో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆసిఫాబాద్ జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ అధికారి అనితపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ దాడిని సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇకే ఈ కేసును తీవ్రంగా పరిగణించింది. ఇది శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యేనని పేర్కొన్న ధర్మాసనం ఈ కేసును తామే స్వయంగా పర్యవేక్షిస్తామని తెలిపింది. అటవీ అధికారుల మీద దాడి చేసి తిరిగి ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి అధికారులకు రక్షణ లేకుండా చేస్తే అటవీ చట్టాలు నీరుగారిపోతాయని చేసిన అప్పెల్ ను సుప్రీం ధర్మాసనం విచారించింది.
సుప్రీం కోర్టు దృష్టికి అనిత కేసు తీసుకెళ్ళిన సీనియర్ న్యాయవాది.. సుప్రీం విచారణ
పర్యావరణానికి సంబంధించి కోర్టుకు సహాయకుడిగా వ్యవహరించే సీనియర్ న్యాయవాది ఏడీఎన్ రావు అనిత కేసును ఇటీవల సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఈ నేపధ్యంలో సీరియస్ అయిన సుప్రీం ధర్మాసనం సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ (సీఈసీ) కాకుండా స్వయంగా తామే పర్యవేక్షిస్తామని పేర్కొంది. ఇది పర్యావరణానికి సంబంధించిన అంశం కాదని, శాంతిభద్రతలకు సంబంధించిన అంశమని పేర్కొంది. శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
అనితపై విచారణ జరుగుతున్న అట్రాసిటీ కేసు దర్యాప్తుపై స్టే విధించిన కోర్టు ..
జస్టిస్ అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయాన్ని విచారిస్తుందని, పిటిషన్ దాఖలు చేయాలని న్యాయవాది ఎడిఎన్ రావును కోరింది. అనితపై విచారణ జరుగుతున్న అట్రాసిటీ కేసు దర్యాప్తుపై కూడా స్టే విధించింది. దాడి సమయంలో పోలీసుల వద్ద ఏకే-47 తుపాకులు ఉన్నప్పటికీ దాడిని ఆపలేకపోయారని ఈ కేసు విషయంలో సీనియర్ న్యాయవాది ఏడీఎన్ రావు పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమం కింద అటవీకరణ ప్రాజెక్టు పనులు చేపడుతున్న సమయంలో ఈ దాడి జరిగిందని కోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ తన బలగాన్ని వెంటేసుకుని వెళ్లి అనితపై దాడి చేశారని వివరించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన అనితకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం తిరిగి అట్రాసిటీ కేసులు పెట్టించి దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు. అటవీ అధికారులను కోర్టులు రక్షించకుంటే ఉల్లంఘనలు పెరుగుతాయని రావు ఆవేదన వ్యక్తం చేశారు. దాడులకు సంబంధించిన మీడియా కథనాలను తన పిటిషన్కు జతచేశారు.
ఈ కేసు తామే విచారణ జరుపుతామన్న సుప్రీం ధర్మాసనం
దీంతో ఈ కేసు తామే విచారిస్తామని చెప్పిన సుప్రీం ధర్మాసనం అనిత కేసు గురించి పూర్తి విచారణ చేపట్టనుంది. ఇప్పటికే ఈ కేసులో అటవీ అధికారిణిపై దాడి జరుగుతున్నా విధిలో నిర్లక్ష్యం చేసినందుకు ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.ఇక మహిళా అటవీ అధికారిణి పై దాడి చేసిన వారి విషయం అటుంచి ఆమెపై పెట్టిన అట్రాసిటీ కేసు విచారణ చెయ్యటం పై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఆ కేసుపై స్టే విధించింది.