వాడివేడిగా సీఎల్పీ సమావేశం: పట్టించుకోవడం లేదన్న సంపత్, సర్దిచెప్పిన జానారెడ్డి!
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్. శనివారం ప్రతిపక్ష నేత జానారెడ్డి ఇంట్లో జరిగిన సీఎల్పీ సమావేశంలో పార్టీ అలసత్వ వైఖరిపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో ఇద్దరు ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్నారని సంపత్ సీఎల్పీ నేతలను విమర్శించినట్టు సమాచారం.శాసనసభా సభ్యత్వం రద్దుపై కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. సభ్యత్వాన్ని పునరుద్దరించడానికి పార్టీ నాయకులు ప్రభుత్వంపై ఎటువంటి ఒత్తిడి తీసుకురావడం లేదని సమావేశంలో ఆయన వాపోయినట్టు చెబుతున్నారు.
అలాగే, రద్దు చేసిన తన గన్మెన్ల పునరుద్దరణపై సీఎల్పీ కనీసం డీజీపీని కూడా కలవలేదని సంపత్ వాపోయారట.
సంపత్ ఆరోపణలు సరికాదన్న జానారెడ్డి
శాసనసభా సభ్యత్వం పునరుద్దరణ విషయంలో సంపత్ కుమార్ పార్టీ నేతలపై చేసిన ఆరోపణలను జానారెడ్డి తప్పుపట్టినట్టు తెలుస్తోంది. సంపత్ కుమార్ కు సర్దిచెప్పిన ఆయన.. పార్టీ పట్టించుకోవడంలేదనడం సరికాదని చెప్పినట్టు సమాచారం.
ఈ కేసుపై వాదించడానికి న్యాయవాది అభిషేక్ సంఘ్వీని హైకోర్టుకు పంపించినట్టు ఆయన పేర్కొన్నట్టు తెలుస్తోంది. సంపత్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎల్పీ.. ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వ రద్దుకు సంబంధించి త్వరలోనే స్పీకర్, డీజీపీ, సీఎస్ లను కలిసి కోర్టు తీర్పు కాపీని అందజేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
హైకోర్టు తీర్పును వెంటనే అమలుచేయాలి: ఉత్తమ్ కుమార్
హైకోర్టు తీర్పును స్పీకర్ వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తీర్పును ఇప్పటిదాకా స్పీకర్ అమలు చేయకపోవడం బాధాకరమన్నారు.
హైకోర్టు తీర్పు అమలుకావడం లేదన్న అంశంపై గవర్నర్, రాష్ట్రపతిలకు కూడా ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఏవిధంగా కూనీ చేస్తున్నారో జాతీయ స్థాయిలో చర్చకు వచ్చేలా చేస్తామని అన్నారు.