రేవంత్ ఇష్యూలో కొత్త ట్విస్ట్: 'నాకు డబ్బివ్వ చూశారు'
ఖమ్మం: ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టైన రేవంత్ రెడ్డి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఏసీబీ అధికారులు అశ్వారాపుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లును కూడా ప్రశ్నించే అవకాశముందని తెలుస్తోంది.
తాటి వెంకటేశ్వర రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని తనను కూడా కొందరు ఆ పార్టీ నాయకులు సంప్రదించారని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే తనకు రూ.50 లక్షలు ఇస్తాని చెప్పారని ఆయన ఆరోపించారు.
టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి ఓటు వేయాలని తనకు చెప్పారన్నారు. తాటి వెంకటేశ్వర్లు గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన తెరాసలో చేరారు.
వైసీపీ నుండి తెరాసలోకి చేరినందువల్ల నీవు టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే ఎవరు అనుమానించరని ఆయనకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇందులో పలు రకాల ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అతను తొలుత టీడీపీ ఆఫర్కు ఓకే చెప్పారని, అయితే రేవంత్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆయన మళ్లీ వెనక్కి తగ్గారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. అయితే, తాను డబ్బులు తీసుకునేందుకు ససేమీరా అన్నానని తాటి చెప్పారు.