రేపిస్ట్ రాజు ఆత్మహత్య ప్రజా పోరాట విజయమన్న ఎమ్మెల్యే సీతక్క .. ప్రభుత్వం శిక్షించలేదని విసుర్లు
సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన రాజు గత ఆరు రోజులుగా పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ రోజు స్టేషన్ ఘనపూర్ సమీపంలోని నష్కల్ రైల్వే ట్రాక్ పై నిందితుడు రాజు శవమై కనిపించాడు. అయితే పోలీసులు రాజు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ధృవీకరించారు.
రాజు ఆత్మహత్య ప్రజా పోరాట విజయం అన్న సీతక్క
ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన ఘటనలో చిన్నారికి న్యాయం జరగాలని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం మొదలైన నేపథ్యంలోనే, వెన్నులో వణుకు పుట్టిన నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. ఇది ప్రజల పోరాట విజయంగా ఆమె అభివర్ణించారు.
భవిష్యత్తులో ఎవరైనా ఇటువంటి దారుణాలకు పాల్పడితే ఇదే గతి
ప్రభుత్వ వైఫల్యం వల్ల రాష్ట్రంలో బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం పూర్తిగా ఇలాంటి ఘటనలను అడ్డుకోవడంలో విఫలమవుతోందని ఎమ్మెల్యే సీతక్క అభిప్రాయపడ్డారు. ప్రజా పోరాట ఫలితంగానే భయపడిన రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అన్నారు. ఇక రాజు తప్పులతో ఎలాంటి సంబంధం లేని రాజు బిడ్డను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు. ప్రజా పోరాటాల వల్లే రాజు చచ్చాడని, ప్రభుత్వం శిక్షించ లేదని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎవరైనా ఇటువంటి దారుణాలకు పాల్పడితే ఇదే గతి పడుతుందని సీతక్క హెచ్చరించారు.
మొన్న రాజును నడిరోడ్డు మీద ఉరి తియ్యాలన్న ఎమ్మెల్యే సీతక్క
మొన్నటికి మొన్న బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన సీతక్క హత్యాచార ఘటనపై నిప్పులు చెరిగారు. పేద గిరిజన బిడ్డ కాబట్టి ప్రభుత్వం సత్వర న్యాయం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రాజు లాంటి రాక్షసులు సమాజంలో ఉండకూడదని వారు ఉంటే ఆడ జాతి మనుగడకే ప్రమాదం అని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాజమండ్రి దుర్మార్గుడిని నడిరోడ్డుపై ఉరితీయాలని ఎమ్మెల్యే సీతక్క ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజు మరణంతో తనదైన శైలిలో స్పందించారు.
రాజు మృతదేహానికి వరంగల్ లో పోస్ట్ మార్టం.. పోలీసులే చంపారన్న రాజు కుటుంబం
ఇదిలా ఉంటే సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన నిందితుడు రాజు మృతదేహాన్ని చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా గుర్తించారు. రాజు మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం రైల్వే పోలీసుల ఆధ్వర్యంలో బంధువులకు అప్పగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాజు ఆత్మహత్యపై వారి కుటుంబ సభ్యులు స్పందించిన విషయం తెలిసిందే. రాజు ది ఆత్మహత్య కాదని, పోలీసులే కావాలని చంపేశారని వారు ఆరోపిస్తున్నారు. రాజును పోలీసులు చంపారని, తన కొడుకును పొట్టన పెట్టుకున్నారని రాజు తల్లి దీనంగా రోదిస్తున్నారు. ఇక నిన్నటి వరకు పోలీస్ స్టేషన్లో ఉంచిన తమను రాత్రి పోలీస్ స్టేషన్ నుండి విడుదల చేశారని, ఎన్కౌంటర్ చేస్తామని చెప్పారని, అలా కాకుండా ఈ విధంగా తన భర్తను చంపేశారని రాజు భార్య ఆరోపిస్తోంది.
అడ్డగూడూరులోనే రాజును పట్టుకున్న పోలీసులు ఆత్మహత్య అంటున్నారని ఆరోపణ
అడ్డగూడూరులోనే పోలీసులు రాజును పట్టుకున్నారని, ఇప్పుడు ఆత్మహత్య అని చెబుతున్నారని రాజు కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. రాజుకు చిన్న పిల్లలంటే ఇష్టం అని, తన తమ్ముడు ఈ దారుణానికి పాల్పడి ఉండడు అని రాజు అక్క కన్నీటి పర్యంతమైంది.10వ తేదీన పోలీసులు తమను అరెస్టు చేసి సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఉంచారని, నిన్న రాత్రి వదిలేశారని రాజు అక్క చెప్పింది. తెల్లారేసరికి మరణ వార్త వినాల్సి వచ్చిందని రాజు కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. పోలీసులే కావాలని రాజుని చంపేశారని ఆరోపిస్తున్నారు.