మనసున్న అక్క..! మన సీతక్క..! లాక్ డౌన్ ఆంక్షల్లో కుగ్రామాల ప్రజల ఆకలి తీరుస్తున్న ఎమ్మెల్యే..!!
హైదరాబాద్ : ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క తన ఉదారస్వభావాన్ని చాటుకుంటున్నారు. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో కుగ్రామాలకు నిత్యావసర వస్తువుల కొరత తారా స్థాయిలో ఏర్పడుతోంది. అందులో ములుగు నియోజకవర్గంలో ఎక్కువగా గిరిజనులు, తండాలు, మారుమూల కుగ్రామాలు ఎక్కువగా ఉంటాయి.
కనీసం వాహనాలు వెళ్లేందుకు రోడ్ల సౌకర్యం కూడా లేని గ్రామాలు అనేకం ఉన్నాయి. కేవలం ఎడ్ల బండ్ల ద్వారానే ఆ గ్రామాల్లోకి ప్రవేశించే వెసులుబాటు ఉంటుంది. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో అలాంటి గ్రామాల నిరుపేద ప్రజల ఆకలి బాధలు తీర్చేందుకు ములుగు ఎమ్మెల్యే సీతక్క పరితపిస్తున్నట్టు తెలుస్తోంది. కాలినడకన, ఎండ్ల బండి మీద నిత్యవసర సరుకులు అందజేస్తూ తన ఔదార్యాన్ని చాటుకుంటున్నారు ఎమ్మెల్యే సీతక్క.
ఎమ్మెల్యే సీతక్క సంకల్పం..
కరోన వైరస్ మహమ్మారిని తరిమికొట్టే నేపధ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉండడంతో కుగ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. సరైన రవాణ సౌకర్యం లేని గ్రామాల్లో పేద ప్రజలు తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న సందర్బాలు వెలుగు చూస్తున్నాయి.
అలాంటి ప్రాంతాల్లో అక్కడి స్థానిక నాయకులు వారి స్థాయిలో ఎంతో కొంత సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ప్రయత్నాల్లో ముందు వరుసలో నిలుస్తున్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. తన నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాడూ ఆకలితో అలమటించకూడదనే లక్ష్యంతో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు.
కుగ్రామాల్లో ప్రయాణం..
కుగ్రామాల్లోని నిరుపేదలకు సహాయం చేయాలని నిర్ణయించుకొన్న సీతక్క ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ములుగు నియోజకవర్గం ఒక ఆదివాసీ జిల్లాగా కొనసాగుతోంది. అక్కడ కోయ, గోండు, మరియు లంబాడీ లాంటి ఆదివాసీ జాతులు ఎక్కువగా నివసిస్తుంటారు. అడవి ప్రాంతం కాబట్టి కొన్ని చోట్లకి కనీసం రోడ్లు కూడా ఉండకపోవడంతో రవాణా సౌకర్యం ఉండదు.
అలాంటి ప్రాంతాలకు నిత్యావసర సరుకులు చేరవేస్తూ ప్రతి పేదవాడి కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు సీతక్క. అలాంటి ప్రాంతాలకు చేరురకోవడంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్యే. వీలైన చోట ట్రాక్టర్ ప్రయాణం, అక్కడ నుండి ఎడ్ల బండి, అక్కడ నుండి కాలినడక, అవసరం అనుకుంటే బురదలో కూడా నడక కొనసాగిస్తున్నారు సీతక్క.
కరోనా పట్ల అవగాహన కల్పిస్తున్న ఎమ్మెల్యే..
అడవి మార్గం గుండా కుగ్రామాలకు చేరుకోవడంలో తన వ్యక్తిగత సిబ్బంది మరియు గన్ మెన్ లను సైతం వదిలేసి అక్కడి స్థానిక నాయకుల సహాయంతో ఆదివాసీ గ్రామాల్లోని ప్రజలకు కరోన వైరస్ పై అవగాహన కల్పిస్తూ వారికి అవసరమైన నిత్యావసర సరుకులను అందించి వారి ఆకలిని తీర్చడానికి తన వంతు కృషి చేస్తున్నారు సీతక్క. తాను కూడా వారితో పాటే భోజనం చేస్తూ తన నిరాడంబరతను చాటుకుంటున్నారు. ప్రజాసేవ చేయాలనే సంకల్పం ఉంటే ఎంత కష్టం, నష్టం సంభవించనా వెనకడుగు వేసేది ఉండదని సీతక్క నిరూపిస్తున్నారు. సీతక్క పట్టుదలకు, పేదల సమస్యల పరిష్కారానికి చూపిస్తు చొరవ వందకు వంద శాతం ఆదర్శప్రాయంగా ఉందనే చర్చ కూడా జరుగుతోంది.
Recommended Video
కష్టాలకోర్చి కాలినడక ప్రయాణం..
ప్రస్తుత పరిస్ధితుల్లో ఎమ్మెల్యే అనగానే చాలా విలాసవంతమైన జీవనం, మెరుగైన నివాస సదుపాయాలు, అన్ని సౌకర్యాలతో కూడుకున్న వాహనం, మంది,మార్బలం.. ఇది ప్రస్తుత ప్రజా ప్రతినిధుల జీవన శైలి. ప్రజా జీవితంతో పెద్దగా సంబందాలు అవసరంలేని పరిస్థితులు ఉన్న తరుణంలో ఇళ్లకే పరిమితమవుతున్నారు కొంత మంది ప్రజా ప్రతినిధులు. సరిగ్గా ఇలాంటి తరుణంలో అందరు ప్రజా ప్రతినిధుల్లా కాకుండా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు సీతక్క. ఎమ్మెల్యే సీతక్క ఔదార్యం తోటి ప్రజా ప్రతినిధులకు ఎంతో స్పూర్తి దాయకంగా ఉందనే చర్చ జరుగుతోంది. గిరిజన ప్రాంతాల్లోని నిరుపేదల సంక్షేమం కోసం సీతక్క చూపిస్తున్న అంకితభావానికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు స్దానిక ప్రజానికం.