సీఎం కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటా.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆవేదన
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్క విలీనానికి సంబంధించిన అంశాన్ని పక్కనపెట్టి, మిగతా సమస్యల పరిష్కారంపై కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ను కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్న నేపథ్యంలో ఇతర డిమాండ్లను పరిశీలించడానికి సీఎం కేసీఆర్ అంగీకరించారు. ఇందుకోసం ఆర్టీసీ ఎండి, ఆర్టీసీ ఈడీ తో ఒక కమిటీని ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించి నివేదిక తయారు చెయ్యాలని చెప్పారు. ఆ నివేదికను హైకోర్టుకు సమర్పించాలని భావిస్తున్నారు.
TSRTC Strike: ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం: అశ్వద్ధామ రెడ్డి స్పందన ఇది
ఇక ఇదే సమయంలో ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కార్మికులను విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాదు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాను సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలిపిన మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పట్టుదలకు పోకుండా కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని కోరారు. ఇక కార్మికులతో చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఆయన సమ్మెను విరమించి విధులకు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని తాను నమ్ముతున్నానని తెలిపారు ఎమ్మెల్యే శంకర్ నాయక్.
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా మహబూబాబాద్ లో ఆర్టీసీ కార్మికులు ఇటీవల మహబూబాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్నాయక్ క్యాంప్ఆఫీస్ ల గోడలకు వినతిపత్రాలు అతికించారు. విద్యార్థి సంఘాలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశాయి. అయినప్పటికీ స్పందించని ఎమ్మెల్యే శంకర్ నాయక్, నేడు ప్రభుత్వం చర్చకు సిద్ధమైన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల కోసం సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకోవడానికి అయినా సిద్ధంగా ఉన్నానని చెప్పడం గమనార్హం.