షాకింగ్ సూచన: మరో రెండు, మూడు నెలలు లాక్ డౌన్ పొడిగించాలన్న ఎమ్మెల్యే
తన వ్యాఖ్యలతో ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ కు కారణం అయ్యే జగ్గారెడ్డి కరోనా లాక్ డౌన్ విషయంలో అలాగే వ్యాఖ్యలు చేశారు. ఇంకో రెండు, మూడు నెలలు లాక్ డౌన్ విధిస్తే బాగుంటుంది అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సామాన్యుల జీవనం దుర్భరంగా మారి పడరాని పాట్లు పడుతుంటే ఇంకా లాక్ డౌన్ పొడిగించాలని చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి.
లాక్ డౌన్ ఎత్తివేత కోసం ఆశగా ఎదురుచూస్తున్న సామాన్య ప్రజలు
ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ప్రభావంతో తీరని ప్రాణ, ఆర్ధిక నష్టం కొనసాగుతుంది. అయినా సరే లాక్ డౌన్ విధించి ప్రజలు బయటకు వెళ్ళకుండా నిలువరించి కరోనా వ్యాప్తి చెందకుండా కష్టపడుతున్నారు అన్ని రాష్ట్రాల పాలకులు . ఇక ఇదే సమయంలో తెలంగాణా రాష్ట్రంలో కూడా లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ మే 3 వరకు లాక్ డౌన్ విధించగా , తెలంగాణా ప్రభుత్వం కేంద్ర సర్కార్ కంటే ముందే లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ మే 7 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం మంచిదే అయినా ప్రజల జీవనోపాధికి కష్టంగా మారుతున్న వేళ అంతా లాక్ డౌన్ ఎత్తివేత కోసం ఎదురు చూస్తున్నారు.
ఇంకో రెండు మూడు నెలలు లాక్ డౌన్ పొడిగించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచన
ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి షాకింగ్ సూచన చేశారు. లాక్ డౌన్ ను రెండు, మూడు నెలల పాటు పొడిగించాలని ఆయన టీఆర్ఎస్ సర్కార్ కు సూచన చేశారు.మరో రెండు, మూడు నెలలు లాక్డౌన్ పొడిగించాలని ,అలా చేస్తే కరోనా కంట్రోల్ అవుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్కు సూచించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇక తాజాగా కరోన వైరస్ విషయంలో సీఎం కేసీఆర్ ముందుజాగ్రత్తతో మే 7వ తేదీ వరకు లాక్డౌన్ విధించారాని చెప్పిన ఆయన.. మరో రెండు, మూడునెలలు పొడిగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు .
లాక్ డౌన్ విధులు నిర్వర్తించే వారికి అన్ని సదుపాయాలూ కల్పించాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి
లాక్డౌన్ ఫలితాలు ఇప్పుడిప్పుడూ కనిపిస్తున్నాయని అన్నారు. కరోనావైరస్ కేసులు పెరుగకుండా ఉండాలంటే లాక్డౌన్ను మరింత పొడిగించాల్సిందేనన్నారు. ఇక అంతేకాదు లాక్ డౌన్ విధులు నిర్వర్తిస్తున్న వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రాణాలకు సైతం తెగించి విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, నర్సులకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయలు కల్పించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
Recommended Video
ఆర్ధిక నిపుణుల సలహాలు సూచనలు అవసరం అన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
అలాగే, పోలీసులు 24 గంటలు విధులు నిర్వహిస్తున్న కారణంగా వారికి సైతం అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని సూచించారు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సమయంలో ఆర్ధికవేత్తలు కూడా ప్రభుత్వాలు ఆర్ధికంగా ఎలా నిలదొక్కుకోవాలనే అంశంపై సూచనలు ఇస్తూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు . ఆర్ధికవేత్తలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపాలని చెప్పిన జగ్గారెడ్డి తాను చేసిన సూచనలపై సీఎం కేసీఆర్ ఆలోచించాలని కోరారు.