ఎమ్మెల్యే కుమారుడి హల్చల్: మాముళ్లు ఇవ్వాలని చిరు వ్యాపారులపై వీరంగం, మత్తులో జోగి..
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ కుమారుడు విష్ణువర్ధన్ రెచ్చిపోయాడు. చిరు వ్యాపారులపై తన ప్రతాపం చూపించాడు. మద్యం సేవించి జోగిన చినబాబు.. మాముళ్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. ఈ తతంగాన్ని కొందరు వీడియో తీసి షేర్ చేయడంతో వైరలవుతోంది. అందులో కొందరు చిరు వ్యాపారులు తాము ఎందుకు డబ్బులు ఇవ్వాలని అడుగుతున్న ఆడియో కూడా వినిపించింది.
చిరు వ్యాపారులపై ప్రతాపం..
మెదక్లో చిరు వ్యాపారులు రోడ్డు పక్కన షాపులు పెట్టుకొని జీవిస్తున్నారు. ఎప్పుడూ పోలీసులు వచ్చి తమ వస్తువులు తీసుకెళతారా అనే భయం వారికి ఉంటుంది. చిన్న, పెద్దలతోపాటు మున్సిపాలిటీ వారికి కూడా అంతో కొంత ఇస్తుంటారు. ఇంతలో ఎమ్మెల్యే కూడా సీన్లోకి ఎంటరవ్వడంతో ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు. మాముళ్లు ఇవ్వమని అడగడంతో నోరెళ్లబెట్టారు. ఏంటీ మాముళ్లా.. ఎప్పుడూ ఇవ్వలేదే అని ప్రశ్నించారు. కానీ చినబాబు ఊరుకుంటాడా..? అసలే మద్యం సేవించి ఉండే.. వారిపై తన ప్రతాపాన్ని చూపించాడు.
చినబాబు..
తనకు మాముళ్లు ఇవ్వాల్సిందేనని చినబాబు విష్ణువర్ధన్ పట్టుబట్టాడు. మీరేవరో తెలియదు, ఎప్పుడూ ఇవ్వలేదు కదా.. అని చెప్పిన వినిపించుకోలేదు. చిరు వ్యాపారులతో గొడవ పడ్డాడు. మాముళ్లు ఇవ్వనంటారా అని షాపులపై దాడికి తెగబడ్డాడు. తమకు ఉపాధినిస్తోన్న షాపులపై దాడి చేస్తోన్న చూస్తూ ఊరుకున్నారే గానీ.. ఏమీ అనలేని నిస్సహాయత ఆ షాపు వారిది. దాడి చేయొద్దు అని అంటే మరింత రెచ్చిపోతాడని భయపడిపోయారు.
మద్యం సేవించి
తర్వాత విష్ణువర్ధన్పై పోలీసు స్టేషన్లో చిరు వ్యాపారులు ఫిర్యాదు చేశారు. తమను మాముళ్లు ఇవ్వాలని అడిగాడని, ఇవ్వకపోవడంతో షాపులపై దాడి చేశారని కంప్లైంట్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విష్ణువర్ధన్ మద్యం సేవించి దాడి చేశాడని పోలీసులు కూడా ధృవీకరించారు.