నమ్మినవారే హత్య చేశారు, నేను కాదు, నయీం మనుషులకు టిక్కెట్లు: కోమటిరెడ్డిపై వీరేశం
నల్గొండ: కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పందించారు. శ్రీనివాస్ను తను హత్య చేయించినట్లుగా చేస్తున్న ప్రచారాన్ని, ఆరోపణలను కొట్టి పారేశారు. శ్రీనివాస్ హత్యను కోమటిరెడ్డి వెంకట రెడ్డి రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
శ్రీనివాస్ హత్య: 'కేసీఆర్ను అంటారా, కోమటిరెడ్డి పాములా పెంచారు, కాల్ లిస్ట్ ఇవ్వు'
తనపై హత్యా రాజకీయ ఆరోపణలు చేస్తున్న వెంకట్ రెడ్డి.. తాను ఎమ్మెల్యే అయ్యాక ఎన్ని హత్యలు చేశానో రుజువు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ను నమ్మినవారే హత్య చేశారని ఆయన భార్య లక్ష్మి అన్నారని చెప్పారు. కోమటిరెడ్డి తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు.
నేను ఎమ్మెల్యే కావడం జీర్ణించుకోవడం లేదు
తాను ఎమ్మెల్యే కావడాన్ని కోమటిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని వీరేశం అన్నారు. హత్యా రాజకీయాలు మొదలు పెట్టిందే కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నారు. శవాల మీద పేలాలు ఏరుకునేలా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
నయీంను పెంచి పోషించింది కోమటిరెడ్డి బ్రదర్స్
నయీంను పెంచి పోషించింది కూడా కోమటిరెడ్డి బ్రదర్సే అన్నారు. తాము కూడా నయీం బాధితులమేనని, నయీం మనుషులకు రాజగోపాల్ రెడ్డి టిక్కెట్స్ ఇప్పించారన్నారు. ఇప్పుడు తమపై హత్యా రాజకీయాలు అంటూ ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు.
కోర్టుకు వెళ్తానని కోమటిరెడ్డి సోదరులు
ప్లాన్ ప్రకారమే శ్రీనివాస్ రెడ్డిని హత్య చేశారని కోమటిరెడ్డి బ్రదర్స్ ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. నిందితుల కాల్ లిస్ట్ తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు చెప్పినట్లుగా మిర్చి బండి దగ్గర గొడవ జరగలేదన్నారు. పథకం ప్రకారం హత్య చేశారన్నారు. హత్యపై పూర్తిస్థాయిలో విచారణ జరపలేదన్నారు. తెరాస ఆఫీస్ నుంచి వచ్చిన ప్రెస్ మీట్ చదివారన్నారు. ఎస్పీ చెప్పినట్లుగా నిందితులు హైదరాబాద్ వెళ్లలేదని, కాల్ లిస్ట్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ హత్యపై న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు.
సీబీఐ విచారణకు డిమాండ్
తన భర్త హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని శ్రీనివాస్ భార్య లక్ష్మి డిమాండ్ చేస్తున్నారు. తన భర్తను రాజకీయ కోణంలోనే హత్య చేశారని చెప్పారు. హత్య వెనుక పెద్దల కుట్ర ఉందన్నారు. తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఫోన్ చేసి పిలిపించి మరీ హత్య చేశారన్నారు. సెక్యూరిటీ కావాలని కోరినా పట్టించుకోలేదని, పార్టీ మారాలని ఒత్తిడి చేశారన్నారు.