నాగంకు షాక్: జైపాల్కు, ఆయనకు అండర్స్టాండింగ్, ఓటమి ఖాయం: దామోదర్ రెడ్డి
నాగర్కర్నూల్: మాజీ మంత్రి నాగం జనార్థన్రెడ్డికి స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నేతల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురౌతోంది. కాంగ్రెస్ పార్టీలోకి నాగం జనార్ధన్రెడ్డిని చేర్చుకొంటే గ్రూపు రాజకీయాలు పెరిగిపోతాయని కాంగ్రెస్ పార్టీ నేతలు పీసీసీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. నాగం జనార్ధన్ రెడ్డికి సహకరించబోమని ఎమ్మెల్సీ కూచకుళ్ళ దామోదర్ రెడ్డి పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పారు.
బిజెపి అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీ విధానాలపై నాగం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్గాంధీని కలిశారు.
కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల నుండి చేరికల కారణంగా టిఆర్ఎస్కు గట్టి పోటీ ఇస్తోందనే ప్రచారం సాగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల విషయమై స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు కూడ బహిరంగంగానే అభ్యంతరాలు వ్యక్తం చేసే పరిస్థితులు కన్పిస్తున్నాయి . తాజాగా నాగం జనార్ధన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొంటే తాము సహకరించబోమని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం నాడు హైద్రాబాద్లో మీడియాతో చిట్ చాట్ చేసిన దామోదర్ రెడ్డి తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు.
నాగం జనార్ధన్రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో తీసుకోవద్దు
మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే గ్రూపు రాజకీయాలు పెరిగే అవకాశం ఉందన్నారు. టిడిపిలో ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నాగం జనార్ధన్ రెడ్డికి తాము సహకరించబోమని దామోదర్ రెడ్డి చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులు పెట్టారని కాంగ్రెస్ పార్టీ నేత దామోదర్ రెడ్డి గుర్తు చేశారు.
క్యాడర్ లేని లీడర్ నాగం జనార్ధన్ రెడ్డి
మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి క్యాడర్ లేని లీడరని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఆరోపించారు నాగం జనార్ధన్ రెడ్డిని పార్టీలో చేర్చుకొంటే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. లాభం కంటే ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉందని దామోదర్ రెడ్డి చెప్పారు కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు తయారయ్యే అవకాశం ఉందని చెప్పారు.క్యాడర్ లేని లీడర్ నాగం జనార్ధన్ రెడ్డి, ఎన్నికల్లో బరిలోకి దిగితే ఓటమి ఖాయమని దామోదర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
నాగంకు షాక్: కాంగ్రెస్లో చేరికకు దామోదర్ రెడ్డి మోకాలడ్డు, ఎఐసిసికి ఫిర్యాదు
రాహుల్కు ఫిర్యాదు చేశాం
నాగం జనార్ధన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం వల్ల చోటు చేసుకొనే పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీకి వివరించినట్టు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి చెప్పారు. ఇటీవల కాలంలో తనతో పాటు మాజీ మంత్రి డికె అరుణ, నాగర్ కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్యలు కలిసి రాహుల్ గాంధీని కలిసి నాగం జనార్ధన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని కోరినట్టు చెప్పారు.
నాగం జనార్ధన్రెడ్డికి, జైపాల్ రెడ్డికి మధ్య అవగాహన
మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డికి మధ్య అవగాహన ఉందని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అవగాహన మేరకు నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.