ఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
అమరావతి/హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యే కోటా కింది అయిదు చొప్పున ఎమ్మెల్సీ స్థానాలకు ఈ షెడ్యూల్ను ఎన్నికల సంఘం సోమవారం నాడు విడుదల చేసింది. రెండు రాష్ట్రాల్లో మొత్తం పది ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఫిబ్రవరి 21వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 28వ తేదీన నామినేషన్లు వేసేందుకు చివరి తేదీ. మార్చి 1వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. మార్చి 5వ తేదీన నామినేషన్ ఉపసంహరణ గడువు ఉంది. మార్చి 12వ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ జరగనుంది. మార్చి 15వ తేదీన ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
ఏపీ నుంచి మంత్రి నారాయణ, లక్ష్మీ శివకుమారి, శమంతకమణి, మంత్రి యనమల రామకృష్ణ, ఆదిరెడ్డి అప్పారావుల పదవీ కాలం ముగిసింది. తెలంగాణలో షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మహ్మద్ సలీం, సంతోష్ కుమార్, మహమూద్ అలీల స్థానాలు ఖాళీ కానున్నాయి.