కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్.. ఓటుకు నోటు వ్యవహారం మళ్లీ తెరమీదకొస్తుందా ?
తెలంగాణ రాష్ట్రంలో మరో ఓటుకు నోటు వ్యవహారం తెరమీదకు రాబోతుందా? ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ కి టెన్షన్ పుట్టించబోతున్నాయా ? ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడం కోసం ఎవరు ఎవరిని ప్రలోభాలకు గురి చేయబోతున్నారు? అన్న ప్రశ్నలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే ఓటుకు నోటు వ్యవహారంలో స్టీఫెన్ సన్ ను ప్రలోభాలకు గురి చేయబోయి నాడు టిడిపిలో ఉన్న రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్కయ్యాడు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్న చర్చ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని రంగంలోకి దిగనున్న కాంగ్రెస్
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలపాలని టీ.కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తులు ప్రారంభించింది. టీఆర్ఎస్ 5 స్థానాలపై కన్నేయడంతో తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా హస్తం నేతలు ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలపై దృష్టిసారించింది. పార్టీల బలబలాలు, గెలుపోటములపై లెక్కలేసిన హస్తం పార్టీ తమ అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు రెడీ అయ్యింది. పార్టీల సంఖ్యాబలం ప్రకారం టీఆర్ఎస్కి కేవలం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకునే అవకాశమే ఉంది. కానీ, 5వ స్థానానికి కూడా మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించడాన్ని కాంగ్రెస్ తప్పుబడుతోంది.
అవకాశం లేకున్నా ఐదో స్థానం కోసం కెసిఆర్ వ్యూహాత్మక నిర్ణయం
అసెంబ్లీలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేను కలుపుకొని మొత్తం సభ్యుల సంఖ్య 120 ఉండగా అందులో టీఆర్ఎస్ సంఖ్య ఇటీవల పార్టీలో చేరిన స్వతంత్ర అభ్యర్థులతో కలిపి 91కి చేరింది. మిత్రపక్షం ఎంఐఎంకు ఉన్న ఏడుగురితో కలిపితో 98. ఇక కాంగ్రెస్కు 19 మంది, టీడీపీకి ఇద్దరు, బీజేపీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అయితే, బీజేపీ తటస్తంగా ఉండే అవకాశం కనిపిస్తుండగా, టీడీపీ సభ్యుల్లో ఒకరు కాంగ్రెస్కు, మరొకరు టీఆర్ఎస్కు మద్దతిచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెక్కల ప్రకారం కాంగ్రెస్కు 20 మంది ఉన్నట్టే. ఇక ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ఒక్కో ఎమ్మెల్సీకి 21 మంది ఓటు అవసరం. కానీ, టీఆర్ఎస్ చెప్పినట్టు ఎంఐఎం అభ్యర్థిని పోటీలో నిలిపితే మాత్రం ఐదో అభ్యర్థికి 7ఓట్లు తగ్గుతాయి. కాంగ్రెస్కు 20 మంది ఉన్నందున ఎలిమినేషన్ పద్ధతిలో టీఆర్ఎస్ నిలిపే 5వ అభ్యర్థి మొదటి ప్రయార్టీ ఓట్లలోనే ఎగిరిపోయే ప్రమాదం ఉంది.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తారా.. ఓటుకు నోటు మరోమారు తెరపైకి వస్తుందా
అయితే ఇందులోని అసలు ట్విస్ట్ ఉంది. ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు తమతో టచ్ లో ఉన్నారు అని చెబుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేయడమో, గైర్హాజరు కావడం కానీ జరిగితేనే టిఆర్ఎస్ పార్టీ కి 5వ స్థానం దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి అవకాశముందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. పైసలు ఎర చూపి తన పార్టీలోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం కూడా ఉందని కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఐదవ స్థానం కోసం టిఆర్ఎస్ పార్టీ ప్రయత్నించడం కాంగ్రెస్లో గుబులు రేపుతోంది. అయితే, కాంగ్రెస్ తమ అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తోంది. ఎవరైతే ఎమ్మెల్యేలందరి ఆమోదం లభిస్తుందన్న లెక్కలు వేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే వారు ఎవరు.. కాంగ్రెస్ లో ఇదే టెన్షన్
కాంగ్రెస్ నుండి అభ్యర్థులుగా పొంగులేటి సుధాకర్రెడ్డి, మర్రి శశిధర్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి పేర్లతో రాష్ట్ర నాయకత్వం ఓ జాబితాను కేంద్రానికి పంపింది. ఈ నెల 28వరకూ నామినేషన్లకు గడువు ఉండటంతో అభ్యర్థి ఎంపికకు కొంత సమయం పడుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఓటు వేసే వారు ఎవరు? తమను కాదని టిఆర్ఎస్ కు మద్దతిచ్చే వారు ఎవరు అన్నది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో వాడివేడిగా జరుగుతున్న చర్చ. గతంలో ఓటు కి నోటు వ్యవహారంతో ప్రలోభాలకు గురి చేయొద్దని శ్రీరంగ నీతులు చెప్పిన కేసీఆర్ తమకు నైతికంగా అవకాశం లేకుండా 5వ స్థానానికి పోటీ చేసి కాంగ్రెస్ నాయకుల ప్రలోభాలకు గురి చేస్తారా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్న కాంగ్రెస్ మరి ఆ ఒక్కస్థానాన్నైనా దక్కించుకుంటుందా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.