ఎమ్మెల్సీ ఎన్నికలు: ఏకగ్రీవం, టిఆర్ఎస్ ఖాతాలోకి మరో మూడు...
హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఖాతాలోకి మరో ఎమ్మెల్సీ స్థానం చేరింది. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు.
కరీంనగర్ జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలను కూడా ఏకగ్రీవమయ్యాయి. అధికార టిఆర్ఎస్ అభ్యర్థులు నారదాసు లక్ష్మణ రావు, భాను ప్రసాద రావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత రెండు రోజులుగా మంత్రి ఈటెల రాజేందర్ చేసిన ప్రయత్నంతో ఈ రెండు స్థానాలు టిఆర్ఎస్ హస్తగతమయ్యాయి.
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి భూపతి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అదికారి రవీందర్ రెడ్డి శనివారంనాడు ప్రకటించారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ నుంచి డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా జెడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యుల ఫోరం నుంచి బత్తిని జగదీశ్ నామినేషన్లు దాఖలు చేశారు.
అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణారెడ్డి శుక్రవారం నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీందర్రెడ్డికి లేఖ అందించారు. ఆయనకు అధికారపార్టీ ముఖ్యనేతల నుంచి కూడా రాజకీయ భవిష్యత్తుపై హామీ లభించినట్లు తెలిసింది. ఇండిపెండెంట్ అభ్యర్థి జగదీశ్ హైదరాబాద్ వచ్చి ఆ తర్వాత పోటీ నుంచి తప్పుకున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి పోటీనుంచి వైదొలగటంతో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ముఖ్యనాయకులు, మాజీ మంత్రులు షబ్బీర్అలీ, సుదర్శన్రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్రెడ్డిలు షాక్కు గురయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయభేరి మోగిస్తుండటంపై వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ ముఖ్యసలహాదారు డీ శ్రీనివాస్, ఎంపీ కల్వకుంట్ల కవితతోపాటు, ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తంచేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో 12 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా, వరంగల్ జిల్లా నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కొండా మురళి ఎన్నిక గురువారం ఏకగ్రీవమైంది. శుక్రవారం ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు పురాణం సతీశ్, వీ భూపాల్రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది.