కేసీఆర్కు 120 డిగ్రీల జ్వరం: నాలిక్కర్చుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ
హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల సమావేశాలు మంగళవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. 'తెలంగాణ రైతాంగ హక్కుల పరిరక్షణ కోసం గత ప్రభుత్వ హాయాంలో సీఎం కేసీఆర్ 120 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ మహబూబ్నగర్ జిల్లా గద్వాలలో పాదయాత్ర చేశారు..' అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మంగళవారం శాసన మండలిలో చెప్పడంతో నవ్వులు పూయించింది.
102 డిగ్రీలకు బదులు 120 డిగ్రీలని పేర్కొనడంతో శాసనమండలిలోని మిగిలిన సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాంతో కర్నె ప్రభాకర్ నాలిక కర్చుకున్నారు. వెంటనే కర్నె ప్రభాకర్ తన మాటను సరిదిద్దుకున్నారు. మండలిలో మంగళవారం రైతు ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా రైతుల పట్ల ప్రభుత్వ వైఖరీని తెలిపే సందర్భంలో కర్నె ప్రభాకర్ ప్రసంగించిన సమయంలో ఈ ఘటన జరిగింది.
రైతు ఆత్మహత్యలు, రైతుల సమస్యలపై వాడి వేడిగా చర్చలు సాగాయి. ప్రతిపక్షం, పాలకపక్షం మధ్య మాటల యుద్ధం సాగింది.