దేశపతి శ్రీనివాస్కు ఎమ్మెల్సీ! : కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా!
చాన్నాళ్లుగా కేసీఆర్ కు సన్నిహిత వ్యక్తిగా మెలుగుతున్న దేశపతి శ్రీనివాస్కు కూడా ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టబోతున్నారనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడిన వ్యక్తులకు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తూ వస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ధూంధాం గాయకుడు రసమయి, ఉస్మానియా పోరు బిడ్డ బాల్క సుమన్, మరో విద్యార్థి నేత గ్యాదరి కిశోర్.. లాంటి వ్యక్తులను చట్టసభల్లోకి అడుగుపెట్టే అవకాశం కల్పించారు.
దేవిప్రసాద్, శ్రీనివాస్ గౌడ్ లాంటి ఉద్యోగ సంఘ నేతలకు కూడా రాజకీయవకాశం కల్పించారు. ఇక చాన్నాళ్లుగా కేసీఆర్ కు సన్నిహిత వ్యక్తిగా మెలుగుతున్న దేశపతి శ్రీనివాస్కు కూడా ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టబోతున్నారనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ నుంచి ఎమ్మెల్సీ పదవికి సంబంధించిన గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టే.. టీచర్ పదవికి సైతం ఆయన రాజీనామా చేసినట్టుగా చెప్పుకుంటున్నారు.
అంతకుముందు ఆయన సీఎంవోలో ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) విధులు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. అయితే టీచర్లను డిప్యూటేషన్ పై పంపించవద్దన్న సుప్రీం ఆదేశాల నేపథ్యంలో.. ఆయన్ను ఓఎస్డీ నుంచి తప్పించడం.. ఆ తర్వాత ఆయన తన టీచర్ పోస్టుకు రాజీనామా చేయడం జరిగిపోయాయి. దేశపతి పెట్టుకున్న వీఆర్ఎస్కు ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
ప్రస్తుతం ఆయన ప్రభుత్వ మాజీ ఉద్యోగిగా మారిపోయిన నేపథ్యంలో.. ఆయనకు ఎమ్మెల్సీని కట్టబెట్టి శాసనమండలికి పంపించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.