చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లేవారిగా భావించి పాతబస్తీలో వందలాదిమంది రాళ్లదాడి, ఒకరి మృతి
హైదరాబాద్: పాతబస్తీలో దారుణం జరిగింది. చిన్న పిల్లల్ని ఎత్తుకువెళ్లేవారిగా భావించి ముగ్గురిపై వందలాదిమంది స్థానికులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాళ్ల దాడిని అడ్డుకోబోయిన పోలీసులపై కూడా రాళ్లు రువ్వారు.
చాంద్రాయణగుట్ట పూల్బాగ్ ప్రాంతంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. చిన్న పిల్లలను ఎత్తుకెళ్లేవారుగా భావించి స్థానికులు వారిపై దాడి చేశారు. ఈ గొడవ గురించి సమాచారం అందడంతో కంచన్బాగ్ ఎస్సై శంకర్, ఇతర సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను విడిపించే యత్నం చేయడంతో స్థానికులు ఆగ్రహానికి గురై పోలీసు సిబ్బందిపైనా దాడి చేశారు.
ఆ ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులపై బండ రాళ్లను వేసి కొట్టారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందారు. దాడికి గురైన వారు హిజ్రాలుగా తొలుత భావించారు. ఓ వైపు ఈ గొడవ జరుగుతుండగానే స్థానిక పోలీస్ స్టేషన్ పైన కూడా రాళ్ల దాడి జరిగింది. ఈ రెండింటికి పాల్పడింది.
. అయితే వారి మృతి గురించి రాత్రి 12.30 గంటల సమయానికీ పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. ఆ గుర్తు తెలియని వ్యక్తులను హిజ్రాలుగా భావిస్తున్నారు. ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే ఒక గుంపు చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్పై రాళ్లు విసిరారు.
పాతబస్తీ ప్రశాంతంగా ఉంది: సౌత్ జోన్ డీసీపీ
పాతబస్తీ ప్రస్తుతం ప్రశాంతంగా ఉందని, ఎలాంటి వదంతులు నమ్మవద్దని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ చెప్పారు. కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. దాడిలో మృతి చెందిన వారు హిజ్రాలు కాదని, పొట్టకూటి కోసం ఆడవేషంలో అడుక్కునే వారన్నారు. పాతబస్తీలో దాడి ఘటనకు సంబంధించి 25 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు.