బీదర్లో ఘోరం: హైదరాబాద్ కుటుంబంపై 100మంది దాడి, ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
బీదర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఈ మూర్ఖపు జనాలు మారడం లేదు. ఇప్పటికే కిడ్నాప్ ముఠాలంటూ దేశంలో 29మందిని పొట్టన పెట్టుకున్న మూర్ఖులు.. తాజాగా మరో వ్యక్తిని బలితీసుకున్నారు.
కర్ణాటకలోని బీదర్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పిల్లలను ఎత్తుకెళ్లే కిడ్నాపర్లనే అనుమానంతో హైదరాబాదీలపై స్థానికులు దాడి చేశారు. ఈ దాడిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బీదర్ జిల్లా ఔరాద్ తాలూకా ముర్కీ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన మహ్మద్ ఆజాం మృతిచెందగా.. నగరానికి చెందిన తహ్లా ఇస్మాయిల్, మహమ్మద్ సల్మాన్ గాయపడ్డారు. ఔరాద్ తాలూకా హండికేరాకు చెందిన మహమ్మద్ బషీర్ పిలుపు మేరకు వీరు అతడి స్వగ్రామాన్ని, వ్యవసాయ భూమిని సందర్శించేందుకు నగరం నుంచి వెళ్లారు.
కాగా, బషీర్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. వారు వాహనంలో హండికేరా వెళుతుండగా.. మార్గమధ్యంలో బాల్కూట్ తండా వద్ద అల్పాహారం తీసుకునేందుకు ఆగారు. ఈ సందర్భంగా ఇటీవల కతార్ నుంచి తిరిగివచ్చిన ఇస్మాయిల్ తాను తీసుకువచ్చిన చాక్లెట్లను స్థానిక బడి పిల్లలకు పంచినట్టు తెలుస్తోంది. వారు చేసిన ఈ మంచిపనే స్థానికులకు అనుమానం కలిగించింది.
వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో ఇటీవల వచ్చిన వదంతులు, పుకార్ల ప్రభావంలో ఉన్న వారు.. వీరిని పిల్లల కిడ్నాపర్లు అని అనుమానించారు. అంతే, మనుషులమన్న విచక్షణ కోల్పోయి.. కనికరం లేకుండా మహ్మద్ ఆజాం, అతని స్నేహితులపై దాడి చేశారు.
బషీర్ వారికి నిజానిజాలు వివరించేందుకు ప్రయత్నించినా.. ఆ మూర్ఖులు పట్టించుకోలేదు. దీంతో అక్కడి నుంచి వారు కారులో తప్పించుకున్నప్పటికీ.. సమీపంలోని ముర్కీ గ్రామంవద్ద రోడ్డుకు అడ్డంగా చెట్టును పడేసి.. వారిని అడ్డుకున్నారు. వారిని కారులో నుంచి బయటకు లాక్కొచ్చి.. రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. విచక్షణ మరిచి దాదాపు 100 మంది స్థానికులు ఆటవికంగా ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసులు 30మందిని అరెస్టు చేశారు.
ఈ దాడిలో మహ్మద్ ఆజాం మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్కు యశోదా ఆస్పత్రి(మలక్పేట)కి తరలించారు. బాధితులను ఆస్పత్రిలో మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల పరామర్శించారు. అనుమానం వస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ పోలీసులు ప్రజలకు చెబుతున్నా.. జనాలు మాత్రం మూర్ఖంగా ప్రవర్తిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.