విచిత్రం: తెలంగాణలో జనాభా సంఖ్యను దాటిన మొబైల్ కనెక్షన్లు
హైదరాబాద్: జనాభా కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్ల సంఖ్య పెరిగిన విచిత్ర పరిస్థతి తెలంగాణలో నెలకొంది. రాష్ట్రంలో 3.52 కోట్ల జనాభా ఉండగా చరవాణి కనెక్షన్లు 3.66 కోట్లుగా ఉంది. సమాచార కమ్యూనికేషన్ల వ్యవస్థను విశ్లేషిస్తూ, రాష్ట్ర అర్థ గణాంక శాఖ తాజాగా విడుదల చేసిన రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది.
రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 83,03,612 కుటుంబాలు నివసిస్తుండగా 3.66 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. సగటున ప్రతి కుటుంబంలో నలుగురు మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నట్టు వెల్లడైంది. మొత్తం సెల్ ఫోన్ కనెక్షన్లలో మూడింట ఒక వంతు హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోనే ఉన్నాయి.
రాష్ట్రంలో 6,24,224 ల్యాండ్ఫోన్లు ఉండగా వీటికోసం 1314 టెలిఫోన్ ఎక్స్ఛేంజ్లు పనిచేస్తున్నాయి. 13223 ప్రజా టెలిఫోన్లు ఉండగా వీటిలో సగం కంటే ఎక్కువ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. హైదరాబాద్ పబ్లిక్ టెలిఫోన్ బూత్ ల సంఖ్య 8,220కి తగ్గింది.