అర్ధరాత్రి దాకా మోడీ-షా చర్చలు: తెలంగాణకు మొండిచేయి? ఢిల్లీకి హరిబాబు, టిడిపి మంత్రులపై..
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఆదివారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరిగనుంది. రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ కొత్తమంత్రులతో ప్రమాణం చేయించనున్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఆదివారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరిగనుంది. రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ కొత్తమంత్రులతో ప్రమాణం చేయించనున్నారు. మంత్రివర్గ విస్తరణపై అర్ధరత్రి వరకు ఉత్కంఠ కొనసాగింది.
ప్రధాని మోడీ పార్టీ అధ్యక్షులు అమిత్ షాతో అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. తొమ్మిది మంది కొత్త మంత్రుల పేర్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసందే. వీరిలో ఒకరు రాజ్యసభ, ఆరుగురు లోకసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
హరిబాబుకు ఛాన్స్
ఇద్దరు ప్రస్తుతానికి ఏ సభలోనూ సభ్యులుగా లేరు. ఏపీ నుంచి కంభంపాటి హరిబాబుకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు. ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తోంది. దీంతో విజయవాడలో ఉన్న హరిబాబు ఢిల్లీకి చేరుకున్నారు. కొత్త మంత్రులుగా పేర్లు వెల్లడైన వారిలో ఇద్దరు ఐఏఎస్, ఒకరు ఐపీఎస్, ఇంకొకరు ఐఎఫ్ఎస్ అధికారిగా సేవలందించారు.
అధికారులకు ఎందుకంటే..
రాష్ట్ర మంత్రులుగా, అఖిల భారత స్థాయి అధికారులుగా క్షేత్రస్థాయిల్లో అందించిన విశేష సేవలను గుర్తించి మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ ప్రాధాన్యాలు, కుల, మతాల లెక్కలను కూడా బేరీజు వేసుకొని వీరిని ఎంపిక చేశారని తెలుస్తోంది.
దత్తాత్రేయ స్థానంలో ఎవరికీ లేదా?
తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మురళీధర రావుకు వస్తుందని ప్రచారం జరిగింది. కానీ తెలంగాణకు మొండిచేయి చూపుతున్నారని సమాచారం. ఎవరికీ అవకాశం ఇవ్వడం లేదు.
టిడిపి మంత్రుల శాఖల్లో మార్పు లేదు
టిడిపికి చెందిన అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిల మంత్రి పదవుల్లో ఎలాంటి మార్పులు లేవని తెలుస్తోంది. పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్ల శాఖలు మారనున్నాయని తెలుస్తోంది.
రక్షణ శాఖకు సురేష్ ప్రభు
రక్షణ శాఖ మంత్రిగా సురేష్ ప్రభును దాదాపు ఖరారు చేశారని తెలుస్తోంది. రైల్వే మంత్రిగా నితిన్ గడ్కరీని నియమించాలని తొలుత భావించినా, అందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారని సమాచారం. దీంతో ఇప్పుడు సహాయ మంత్రిగా ఉన్న మనోజ్ సిన్హాకు పదోన్నతి లభించనుందని తెలుస్తోంది. తొమ్మిది మంది కొత్త మంత్రులు వస్తే నలుగురు బ్యూరోక్రాట్లు రావడం గమనార్హం.
ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల నుంచి
మిగిలిన ఐదుగురిలో ఎన్నికలు జరుగనున్న కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు. బీహార్ నుంచి రూఢీని, యూపీ నుంచి కల్రాజ్ మిశ్రాను తప్పించారు. కాబట్టి ఆ రాష్ట్రాల వారికి ఒక్కొక్కరికి మంత్రి పదవి ఇచ్చారు.
తొమ్మిదిమందికే పరిమితమా లేక
శనివారం ఉదయం నుంచి మధ్యప్రదేశ్కు చెందిన ప్రహ్లాద్ పటేల్, మహారాష్ట్రకు చెందిన వినయ్ సహస్రబుద్ధి, కర్ణాటకకు చెందిన ప్రహ్లాద్ జోషీ, సురేష్ అంగడి, రాజస్థాన్కు చెందిన ఓపీ మాథుర్, భూపేంద్రయాదవ్ల పేర్లు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. రాత్రి వెలుగులోకి వచ్చిన మంత్రుల జాబితాలో వీరి పేర్లూ కనిపించకపోవడంతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ 9 మంది కొత్తవారి చేరికకే పరిమితమవుతుందా? లేదంటే ఆ జాబితాలో లేని వారు కూడా ఉంటారా? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. తెలంగాణ నుంచి కేంద్ర జలవనరుల మంత్రి సలహాదారు శ్రీరాం వెదిరె పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.