నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా.. మోదీపై పోటీకి సిద్దమౌతున్న నిజామాబాద్ పసుపు రైతులు !
Recommended Video
హైదరాబాద్ : నిజామాబాద్ రైతుల పసుపు సెగ దేశ ప్రధాని మోదీ కి తగలబోతోంది. తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిజామాబాద్ పసుపు రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టు ఎన్నికల్లో వారు వ్యవహరించిన తీరు మర్చిపోకముందే మరో సంఘటన చోటుచేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ బరిలో నిలిచిన వారణాసి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని రైతులు నిర్ణయించారు. ఈ మేరకు పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు దైవశిగామణి నాయకత్వంలో 50 మంది రైతులు చలో వారణాసి కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలోని అర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి వారణాసి వెళ్తున్నామని రైతులు చెప్పారు. స్వతంత్ర అభ్యర్థులుగా వారణాసి ఎంపీ స్థానానికి నామినేషన్ వేస్తామన్నారు.
పసుపు బోర్డుతోపాటు పంటకు మద్దతు ధర సాధించాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నామని, ఏ అభ్యర్థికి వ్యతిరేకంగా తాము ప్రచారం నిర్వహించబోమని స్పష్టంచేశారు. నిజామాబాద్లో పోటీ వ్యవహారాన్ని బీజేపీ, కాంగ్రెస్లు రాజకీయంగా వాడుకున్నాయని ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీ కవిత లక్ష్యంగా ప్రచారం చేయడం వల్ల అసలు లక్ష్యం పక్కదారి పట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు మద్దతుగా తమిళనాడు నుంచి కొందరు రైతులు వస్తున్నారని, ఇతర ప్రాంతాల నుంచి రైతులు తరలి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్న డిమాండ్లను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇటీవల తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 185 మంది రైతులు బరిలో నిలవడం సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.