మేము ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉంటాం: ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్లో అమిత్ షా
Recommended Video
హైదరాబాదు: రాజకీయనాయకులు కేవలం ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉంటారని అదే పోలీసులు దాదాపు 30 ఏళ్ల పాటు సర్వీసులో ఉంటారని అన్నారు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా. హైదరాబాదులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 70వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. మొత్తం 92 మంది ఐపీఎస్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు.
ఐపీఎస్ శిక్షణ పూర్తికాగానే అంతా అయిపోలేదని ఇకనుంచి లక్ష్యసాధన దిశగా పనిచేయాలని హోంశాఖ మంత్రి అమిత్ షా కొత్త ఐపీఎస్ అధికారులకు పిలుపునిచ్చారు. ఈ రోజు నుంచే లక్ష్యసాధన ప్రారంభమైందని చెప్పిన అమిత్ షా... నిజాయితీతో పనిచేసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఇక పేదరికంలో మగ్గుతున్న ప్రజలకు సేవచేసి వారిని వృద్ధిలోకి తీసుకురావాలన్నారు. పేదప్రజల తరపున నిలిచి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అమిత్ షా పిలుపునిచ్చారు. మనసు చెప్పినట్లుగా నడుచుకోవాలని చెప్పిన అమిత్ షా ఎక్కడేకానీ రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినకుండా వ్యవహరించాలని చెప్పారు.
ఇక హైదరాబాద్ సంస్థానంను భారత్లోకి విలీనం చేసేందుకు తొలి హోంమంత్రి సర్దార్ వల్లాభాయ్ పటేల్ ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు అమిత్ షా . భారత్లోకి ఎన్నో సంస్థానాలను విలీనం చేసేందుకు పటేల్ కష్టపడ్డారని చెప్పారు. ఎప్పటి నుంచో సమస్యగా మారిన జమ్మూ కశ్మీర్కు మోడీ సర్కార్ విముక్తి కల్పించిందని అమిత్ షా గుర్తు చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేసి అక్కడి అభివృద్ధికి తమ ప్రభుత్వం బాటలు వేస్తోందని చెప్పారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి పటేల్ ఆశయం నెరవేర్చామని చెప్పారు అమిత్ షా.
పరేడ్లో మొత్తం 92 మంది ఐపీఎస్లు, 11 మంది ఫారెన్ ఆఫీసర్లు పాల్గొన్నారు. వీరిలో 12 మంది మహిళా ఐపీఎస్లు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ఐపీఎస్ ట్రైనీలు ఉన్నారు. ట్రైనింగ్లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన గోష్ ఆలంను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్, కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీలు పాల్గొన్నారు.