నరేంద్ర మోడీకి కేసీఆర్ మిత్రుడేనా?: ఐసీయూలో ఆర్థిక వ్యవస్థంటూ చిదంబరం ఫైర్
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం తీవ్ర విమర్శలు చేశారు. మోడీ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలోకి వెళ్లిందని అన్నారు. బంజారాహిల్స్లోని ముఫకంజా కళాశాలలో కేంద్ర బడ్జెట్, ఆర్థిక వ్యవస్థపై ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో ఆయన ప్రసంగించారు.
మోడీ సర్కారుపై విమర్శలు
దేశ ఆర్థికాభివృద్ధి 8.5 శాతం నుంచి 5 శాతానికి పడిపోయిందని చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలపై నోట్ల రద్దు ప్రభావం చూపిందని వ్యాఖ్యానించారు. జీఎస్టీ మంచిదే అయినప్పటికీ దాన్ని బీజేపీ సర్కారు సరిగ్గా అమలుచేయలేక పోయిందని విమర్శించారు. ప్రతి వ్యవస్థ, విభాగం క్షీణ దశలో ఉన్నాయని చిదంబరం చెప్పుకొచ్చారు.
గాలి కొదిలేసిందంటూ..
కేంద్రం తీసుకొచ్చిన బడ్జెట్లో ఆహార, వ్యవసాయం రంగాలకు రూ. లక్ష కోట్ల మేర కోత విధించారని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకాన్ని విస్మరించారని ఆరోపించారు. నైపుణ్యాభివృద్ధిని కూడా నరేంద్ర మోడీ సర్కారు గాలికొదిలేసిందని చిదంబరం మండిపడ్డారు. దేశంలో అనేక చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయని చిదంబరం ఆరోపించారు. ఆటోమొబైల్ సంస్థలు సంక్షోభంలోకి వెళ్లాయని అన్నారు. పెట్టుబడులు లేక దేశంలో ఉత్పత్తులు నిలిచిపోయాయని, దేశంలో పెట్టుబడులు పెట్టేందుకుక కూడా ఎవరూ ముందుకు రావడం లేదని ఈ మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి ఆరోపించారు.
మోడీకి కేసీఆర్ మిత్రుడా? కదా?
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పైనా చిదంబరం విమర్శలు చేశారు. కేసీఆర్ కేంద్రానికి కొన్నిసార్లు మిత్రుడిగా, కొన్నిసార్లు విభేదించినట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రాన్ని కేసీఆర్ ప్రశ్నించాలని అన్నారు. ఈ సదస్సులో కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్ రెడ్డి, గీతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే కేంద్ర ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్పై కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ తోపాటు పలువురు నేతలు విమర్శలు గుప్పించారు. మరోసారి ప్రజలను మోసం చేశారంటూ మండిపడ్డారు.