మోడీ హైదరాబాద్ వెళ్లాలి: అరవింద్ కేజ్రీవాల్, ‘రోహిత్ సూసైడ్ నోట్ను ఫోరెన్సిక్కు పంపాలి’
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ అన్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో నిరసన తెలుపుతున్న విద్యార్థులను ప్రధాని కలవాలని అన్నారు.
‘బాబా సాహెబ్ అంబేద్కర్కు నివాళులర్పించే ముందే రోహిత్ ఆత్మహత్య విషయంపై మోడీ మాట్లాడాలి. అంతేగాక, నిరసన తెలుపుతున్న విద్యార్థులను ప్రధాని కలవాలి' అని కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
కాగా, శుక్రవారం లక్నోలోని బాబాసాహెబ్ భీంరావు అంబేద్కర్ విశ్వవిద్యాలయం(బిబిఏయూ)లో జరిగిన స్నాతకోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. హెచ్సీయూలో పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధానమంత్రి మోడీ అన్నారు.
రోహిత్ ఆత్మహత్య చేసుకునేంత బలహీన పరిస్థితి రావడం దురదృష్టకరమని అన్నారు. భారతదేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో రాజకీయాలను పక్కనపెట్టి.. బిడ్డను కోల్పోయిన తల్లి శోకాన్ని అర్ధం చేసుకోవాలన్నారు.
రోహిత్ సూసైడ్ నోట్లో కొట్టివేతలున్నాయి, ఫోరెన్సిక్కు పంపాలి
హెచ్సీయూ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ సూసైడ్ నోట్లో కొట్టివేతలున్నాయని ఏబీవీపీ నేత లక్ష్మణ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రోహిత్ సూసైడ్ నోట్ ను ఫోరెన్సిక్ నిపుణులతో పరీక్షించాలన్నారు.
అలాగే మొత్తం ఈ ఘటనపై విచారణ జరపాలన్నారు. ఏఎస్ఏ, ఎస్ఎఫ్ఐపై కేసులు నమోదు చేయాలని, ఈ ఘటనను విపక్ష నేతలు రాజకీయం చేస్తున్నారన్నారు. అలాగే యాకూబ్ మెమన్ ఉరితీతను వ్యతిరేకిస్తూ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ప్రొఫెసర్లు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.