ఫలక్నుమా ప్యాలెస్కు చేరుకున్న మోడీ, ఇవాంకా, కేసీఆర్.. ఇవాంకాకు రాయల్ ట్రీట్మెంట్, మొదలైన విందు
ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫలక్నుమా ప్యాలెస్కు చేరుకున్నారు. ఇవాంకా ట్రంప్ కు మహారాణి స్వాగతం లభించింది.
హైదరాబాద్: ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫలక్నుమా ప్యాలెస్కు చేరుకున్నారు. జీఈఎస్ విశిష్ట అతిథులకు కేంద్ర ప్రభుత్వం తరపున మంగళవారం రాత్రి ఫలక్నుమా ప్యాలెస్లో విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
కాసేపట్లో ఫలక్నుమా ప్యాలెస్లో విందు, ఒకే కారులో రానున్న ఇవాంకా, మోడీ, మహారాణి స్థాయిలో...
జీఈఎస్ విశిష్ట ప్రతినిధులు కూడా ప్రత్యేక బస్సుల్లో విద్యుత్ దీప కాంతుల నడుమ దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఫలక్నుమా ప్యాలెస్కు చేరుకున్నారు. మరోవైపు ప్యాలెస్ వద్ద పటిష్ట పోలీస్ పహారా కొనసాగుతుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ, సలహాదారు ఇవాంకా ట్రంప్ కు మహారాణి స్వాగతం లభించింది. ప్యాలెస్ ప్రధాన గేటు వద్ద ఆమెకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుర్రపు బగ్గీలో ప్యాలెస్ వద్దకు తీసుకెళ్లారు.
ప్యాలెస్లో 101 మంది ఒకేసారి కూర్చుని తినగలిగే డైనింగ్ టేబుల్పై విందులో ప్రొటోకాల్ ప్రధాని మోడీ, ఇవాంకా, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, పలువురు జీఈఎస్ ప్రతినిధులు పాల్గొంటారు. ఫలక్నుమా ప్యాలెస్ను తాజ్ గ్రూప్ లగ్జరీ హోటల్గా మార్చిన తరువాత విచ్చేసిన హై ప్రొఫైల్ విదేశీ అతిథి ఇవాంకా ట్రంప్ మాత్రమే.
ఈ విందులో పారిశ్రామిక వేత్తలు రతన్ టాటా, ముకేశ్ అంబానీ, కుమారమంగళం బిర్లా, ఆది గోద్రేజ్ తదితరులు పాల్గొననున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి శోభా కామినేని, ప్రతాప్ సి రెడ్డి, బీవీ మోహన్రెడ్డి, ఉపాసన, సంజయ్బారు తదితరులు ఈ విందులో పాల్గొననున్నారు. ఇవాంకాకు వడ్డించేందుకు గత నెలరోజులుగా శిక్షణ పొందిన 101 సర్వర్లు సంసిద్ధంగా ఉన్నారు.
విందు అనంతరం ఇవాంకా కాసేపు ప్యాలెస్ లో గడపాలనుకుంటే అందుకు తగ్గ ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. గతంలో నిజాం నవాబు ఉపయోగించిన నిజాం సూట్ ను ఆమెకు కేటాయించారు. విందు అనంతరం ఇవాంకా ట్రంప్ చార్మినార్, లాడ్ బజార్, మక్కా మసీదు, చౌమొహల్లా ప్యాలెస్ తదితర ప్రాంతాలు సందర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్యాలెస్ వద్ద పోలీసుల ఓవరాక్షన్...
ఫలక్నుమా ప్యాలెస్ వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేసినట్లు కొంతమంది విదేశీ అతిథులు ఆరోపించారు. జీఈఎస్లో పాల్గొన్న ముఖ్యమైన అతిథులకు ఈ ప్యాలెస్లో మంగళవారం రాత్రి విందు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ విందులో పాల్గొనేందుకు కొంతమంది అతిథులు బస్సులో ప్యాలెస్ వద్దకు వెళ్లారు. కానీ వారికి అనుమతి లేదంటూ అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఓ విదేశీ అతిథి పోలీసులతో కాసేపు వాగ్వాదానికి కూడా దిగినట్లు తెలుస్తోంది. విందుకు తమనెందుకు అనుమతించరంటూ అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు, ఇలా చేయడం తమను అవమానించడమేనంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.