మన డిమాండ్ల సాధనకై ముస్లిం సోదరులంతా ఏకమవ్వాలి: అసదుద్దీన్
హైదరాబాద్: ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ముస్లింలపై దాడులు అధికమయ్యాయని ధ్వజమెత్తారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ప్రధాని సబ్ కా సాత్ సబ్కా వికాస్ మంత్రం జపిస్తూనే మరోవైపు గోవు పేరిట ముస్లింలను చంపుతున్నారని మండిపడ్డారు. రాజస్థాన్లోని అల్వార్లో అక్బర్ ఖాన్ అనే వ్యక్తి గోవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని చెప్పి హత్య చేశారని... ఆ తరువాత గోవుల జోలికి వస్తే ఇదే జరుగుతుందంటూ ఓ బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడటం అభివృద్ధా అని ప్రశ్నించారు. అంటే మరణం అనేది నిర్ణయించేశారు.. కానీ ప్రధాని మాత్రం కల్లి బొల్లి మాటలు చెబుతారని ఫైర్ అయ్యారు.
మోడీ ప్రధాని అయ్యారు కాబట్టే గోవు పేరుతో ముస్లింలను హతమారుస్తున్నారని తీవ్ర స్థాయిలో అసదుద్దీన్ విరుచుకుపడ్డారు. గోవు పేరుతో ముస్లింలను చంపుతున్నారంటే మీరు భారత దేశాన్ని బలహీన పరుస్తున్నారని ఓవైసీ అన్నారు. మహారాష్ట్ర బస్సు ప్రమాద ఘటనపై ట్వీట్ చేసిన ప్రధాని, అక్బర్ ఖాన్ను చంపితే ఎందుకు ట్వీట్ చేయలేదని సూటిగా ప్రశ్నించారు.
ముస్లింగా ఉన్న మనిషి ప్రాణాలకు విలువ ఇస్తారా... లేక గోవులకు విలువిస్తారా ప్రధాని చెప్పాలని ఓవైసీ అడిగారు. జీవించే హక్కు ప్రతిఒక్కరికి రాజ్యాంగం కల్పించిందని ఇదే విషయం ప్రధానికి గుర్తుచేస్తున్నట్లు ఓవైసీ తెలిపారు. పెరిగిన గడ్డాన్ని తీసేయించినంత మాత్రానా మా యువత ఊరుకోబోదని గడ్డాన్ని మరింత పెంచుతామని కొద్ది రోజుల క్రితం ఓ ముస్లిం యువకుడికి గడ్డం తీసేయించిన ఘటన ఓవైసీ ప్రస్తావించారు.
భారత్లో ఎలాగైతే తమ లక్ష్యాల కోసం హర్యానాలో జాట్లు, మహారాష్ట్రలో మరాఠాలు, పటేళ్లు, గుజ్జర్లు, దళితులు పోరాడుతున్నారో... దేశంలో ముస్లింలు అంతా ఒక్కటై తమ బాధలను కూడా తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్తో పోలుస్తూ ఇక్కడి ముస్లింలను ఎంతకాలం నిర్ణయిస్తావని ప్రశ్నించారు. బీజేపీ అన్ని రంగాల్లో విఫలమైనందునే... వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి ప్రజల్లో ఆందోళన భయం సృష్టించి ఆ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని ఓవైసీ ఆరోపించారు. కాంగ్రెస్ కూడా ముస్లింల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ కాదని ఓవైసీ ఆరోపించారు.