ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ పై.. జైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్పై కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్లో ని గాంధీభవన్లో కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్పై కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్ లోని గాంధీ భవన్లో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
''మోడీ పేరుకే ప్రధాని.. ఆయన్ని నడిపించేది మాత్రం ఆర్ఎస్ఎస్సే..'' అని వ్యాఖ్యానించారు. దేశాన్ని కాషాయీకరణ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పారదర్శకత లేని సంస్థ ఆర్ఎస్ఎస్ అని దుమ్మెత్తిపోశారు.
స్వాతంత్ర్య సమరంలో ఏనాడూ ఆర్ఎస్ఎస్ పాల్గొనలేదన్నారు. త్రివర్ణ పతాకాన్ని సైతం ఆర్ఎస్ఎస్ ఒప్పుకోలేదని చెప్పారు. 2002 వరకు నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరలేదని గుర్తుచేశారు.
కేసీఆర్ వి అందమైన అబద్దాలు...
అందమైన అబద్దాలు చెప్పడంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని మోడీతో పోటీ పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి విమర్శించారు. మోడీ, కేసీఆర్ ఇద్దరూ ఒకటేనని, వారిద్దరి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని కేసీఆర్కు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ శ్రేణులు క్రమశిక్షణతో, సమిష్టిగా పనిచేస్తూ ఆ పార్టీలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన నోట్ల రద్దు, జీఎస్టీని కేసీఆర్ సమర్థించారన్నారు.
దళితులకు భూపంపిణీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఎస్టీ, ముస్లింలకు రిజర్వేషన్ల పెంపుపై మాట తప్పారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామన్న ఆయన.. కేసీఆర్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు.