బిచ్చగాళ్లను చేస్తున్నారు: మోడీ ప్రభుత్వాన్ని ఏకేసిన కేసిఆర్
Recommended Video
హైదరాబాద్: ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం బిచ్చగాళ్లను చేస్తోందని ఆయన అన్నారు.
సమాఖ్య స్ఫూర్తిగా విరుద్దంగా మోడీ, ఆయన ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ దేశాన్ని సాకుతున్న ఏడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని ఆయన అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై మంగళవారం జరిగిన చర్చకు ముందు, చర్చ తర్వాత ఆయన మాట్లాడారు.
కేంద్రం ఏది చేయాలో అది చేయకుండా...
మన దగ్గరి నుంచి ఢల్లీకి వెళ్లేది 50 వేల కోట్ల రూపాయలు కాగా, మనకు తిరిగి ఇచ్చేది కేవలం 24 వేల కోట్ల రూపాయలు మాత్రమేనని, ఢిల్లీ ప్రభుత్వం ఏం చేయాలో అది చేయకుండా రాష్ట్రాలను బికారులను చేస్తోందని కేసీఆర్ అన్నారు. అధికారాలను కేంద్ర ప్రభుత్వం కేంద్రీకరించి, తన గుప్పిట్లో పెట్టుకుంటోందని విమర్శింారు
ఇది సమగ్రతకు మంచిది కాదు..
కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సమగ్రతకు మంచిది కాదని కేసిఆర్ వ్యాఖ్యానించారు. నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న విమర్శను ఆయన గుర్తు చేశారు. ఈ పరిణామాలు మంచివి కావని అన్నారు. రాష్ట్రాలకు ఇచ్ే నిధులు పెంచామని అన్నారు గానీ కేంద్ర ప్రయోజిత కార్యక్రమాల నిధులకు కోత పెట్టారని అన్నారు.
అది మా హక్కు...
గత యుపిఎ ప్రభుత్వం పదేళ్లలో ఇచ్చినదాని కన్నా ఎక్కువిచ్చామని మోడీ కేంద్ర ప్రభుత్వం అంటోందని, అసలు మీరు ఇవ్వడమేమిటి... ఇక్కడెవరో బిచ్చగాళ్లు తీసుకున్నట్లు ఉండదని అన్నారు ఇది హక్కు, చట్టం, రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కు అని కేసీఆర్ అన్నారు. బడ్జెట్తో పాటే రాష్ట్రాలకు ఇచ్చే నిధులు పెరుగుతాయని, ఇందులో ఎవరి మెహర్బానీ ఉందని అన్నారు.
ఆచరణలో అది లేదు...
మనది పేరుకు సమాఖ్య వ్యవస్థ అని, అయితే ఆచరణలో అది లేదని కేసీఆర్ అన్నారు. ద్రవ్య నిర్వహణ అంతా కేంద్రం గుప్పిట్లోనే ఉంటుందని, కేంద్రం ఎలా ఉంటే రా్ట్రాలు అలా ఉండాలని అన్నారు. మోడీ ప్రభుత్వం ద్రవ్య నిర్వహణను మరింతగా జఠిలం చేసిందని విమర్శించారు.
ఉదయ్ పథకంపై ఇలా...
ఉదయ్ పథకం కింద రాష్ట్రాల్లోని విద్యుచ్ఛక్తి పంపిణీ సంస్థలను రుణరహితం చేస్తామని గొప్పగా చెప్పుకున్నారి, కానీ రుణభారమంతా రాష్ట్రాలపై వేశారని కేసిఆర్ విమర్శించారు. ఉదయ్ పథకం కింద తెలంగాణ ప్రభుత్వంపై 9 వేల కోట్ల రూపాయల భారం పడిందని అన్నారు.
మోడల్ స్కూల్స్పై ఇలా...
యుపిఎ ప్రభుత్వ హయాంలో అన్ని రాష్ట్రాల్లో ఆదర్శ పాఠశాలలను నెలకొల్పారని, అకస్మాత్తుగా ఎన్డిఎ ప్రభుత్వం ఈ పథకాన్ని ఆపేసిందని, దీంతో ఆ పాఠశాలల నిర్వహణ భారంతో పాటు సిబ్బంది జీతాల భారం రాష్ట్రాలపై పడిందని అన్నారు. కేంద్రంలో ఓ ప్రభుత్వం పథకాలను ప్రారంభిస్తుందనీ మరో ప్రభుత్వం ఆపేస్తుందని, ఈ ఏకపక్ష నిర్ణయాల ప్రభావం రాష్ట్రాలపై పడుతోందని అన్నారు.