అనుమానం: "కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ వెనక మోడీ, మాటలు అలాగే.."
అమరావతి/ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు థర్డ్ ఫ్రంట్పై ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రకటన వెనక ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
కేసీఆర్ మాటలను చూస్తే అలాగే అనిపిస్తోందని ఆయన అన్నారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అసెంబ్లీలో విపక్షం లేకపోవడం వల్ల ఏం మాట్లాడినా ప్రజల్లోకి వెళ్లడం లేదని అన్నారు.
అందుకే కేసిఆర్ ప్రకటన
ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం కోసమే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రకటన చేశారని అచ్చెన్నాయుడు అన్నారు. త్వరలో జరిగే కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం దేశ రాజకీయాలపై ఉంటుందని ఆయన అన్నారు.
కేంద్రంపైనే దృష్టి...
కర్ణాటకలో 200 శాతం సిద్ధరమయ్య గెలుస్తారని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజల చూపు ప్రస్తుతం కేంద్రంపైనే ఉందని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏ నిర్ణయయం తీసుకుంటుందా అని ప్రజలు వేచి చూస్తున్నారని ఆయన అన్నారు.
మోడీపై మాకు వ్యతిరేకత లేదు..
ప్రధాని మోడీపై తమకు వ్యతిరేకత లేదని అచ్చెన్నాయుడు అన్నారు. విజయవాడ, విశాఖ ఘటనలపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించారని ఆయన చెప్పారు. సిఎం కొత్తగా ఏమీ అడగడం లేదని, ప్రజల మనోభావాలను నేతలు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.
కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికే...
ముఖ్యమంత్రి పదవిని తనయుడు కేటీ రామారావుకు కట్టబెట్టడానికే కేంద్ర రాజకీయాలంటూ కేసిఆర్ హడావిడి చేస్తున్నారని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. నాలుగేళ్లుగా రైతులకు ఏ సహాయం చేయని కేసీఆర్ దేశంలోని రైతులు ఆందోళనగా ఉన్నారని హాస్యాస్పదమని అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులను కమిషన్ కోసమే చేస్తున్నారని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే దానిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.