టిడిపి వారికి ఎందుకు రావట్లేదో: మోడీ వద్ద బాబు మాట చెల్లడం లేదా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచనలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిగణలోకి తీసుకోలేదా? ఓ విధంగా ఆయనకు షాకిచ్చారా? అంటే అవుననే అంటున్నారు.
టిడిపి నేతలకు గవర్నర్ పదవి ఇవ్వాలని దాదాపు ఏడాది క్రితం చంద్రబాబు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ టిడిపి నేతకు గవర్నర్ పదవి ఇప్పిస్తానని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. గత మహానాడులో మోత్కుపల్లి ఈ విషయమై గుర్తు చేశారు కూడా.
బుధవారం నాడు కేంద్రం నాలుగు రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లను నియమించింది. మణిపూర్, పంజాబ్, అసోం, అండమాన్ నికోబర్ దీవులకు కొత్త గవర్నర్లను నియమించింది. ఇందులో చంద్రబాబు విజ్ఞప్తి మేరకు మోత్కుపల్లికి అవకాశం దక్కలేదు. మోత్కుపల్లితో పాటు మరో టిడిపి నేతకు కూడా చంద్రబాబు గవర్నర్ పదవి ఇప్పిస్తానని చెప్పారని తెలుస్తోంది.
ఆ నిధులతో ఏంచేసుకోవాలి: కేంద్రం సాయంపై టిడిపి భగ్గు
ఇప్పుడు కొత్తగా నలుగురు గవర్నర్లను ఇతరులను నియమించింది. దీంతో టిడిపి నేతలకు అవకాశం లేనట్లేనని, చంద్రబాబు మాట చెల్లుబాటు కావడం లేదని అంటున్నారు.
మిగిలింది ఒక్కటే. తమిళనాడు గవర్నర్గా ఉన్న రోశయ్య పదవి ఆగస్టు నెలాఖరున ముగియనుంది. ఆయన స్థానంలో ఎవరికైనా అవకాశం వస్తుంది. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మాత్రం ఆయననే కొనసాగించాలని కేంద్రానికి లేఖ రాశారు.
కాగా, తనకు గవర్నర్ పదవి రాకపోవడంపై మోత్కుపల్లి ఓ ఇంగ్లీష్ పత్రికతో మాట్లాడుతూ... తన అపాయింటుమెంట్ గురించి తెలియదని, గత ఏడాదే తాను దీని గురించి తమ అధినేతకు చెప్పానని, ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న టిడిపి నేతలకు పోస్టుల విషయంలో ఎందుకు అవకాశం రావడం లేదో తనకు తెలియడం లేదన్నారు.
కాగా, ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు తదితరాల విషయంలో టిడిపి - బిజెపి మధ్య అప్పుడప్పుడు మాటల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. టిడిపి - బిజెపి 2019 వరకు కలిసే ఉంటాయని ఇరు పార్టీల ముఖ్య నేతలు చెబుతున్నారు. అదే సమయంలో కొందరు నేతలు పరస్పరం విరుచుకుపడుతున్నారు.