ఒకే రోజు, ఒకే సమయానికి నగరంలో మోదీ, రాహుల్ సభలు..! హోరెత్తుతున్న ప్రచారం..!!
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో విచిత్ర ఘట్టాలు చోటుచేసుకోబోతున్నాయి. పార్టీ అగ్రనేతలు ఎన్నికల్లో ప్రచారానికి సై అంటున్నారు. అంతే కాకుండా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఓ ఆరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. డిసెంబరు 3న, ఒకేరోజు, ఒకే సమయంలో, ఒకే నగరంలో ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇరు పార్టీలకు చెందిన నాయకులు ఎవరికివారే తమ అగ్రనేతల పర్యటనలను విజయవంతం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇలా ఇద్దరూ ఒకే నగరంలో ఒకేసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కీలకఘట్టంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే విమర్శ, ప్రతివిమర్శలు.. అగ్రనేతల పర్యటనలతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం వేడి పుట్టిస్తోంది.
ఒకే రోజు.. ఒకే సమయంలో హైదరాబాద్లో సభలు..! నగరంలో మోదీ, రాహుల్ ప్రచారం..!
ముఖ్యమంత్రి కేసీఆర్ వరుస సభలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోజూ ఆరేడు సభలతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తున్నారు. కేసీఆర్ దూకుడును అందుకోవడం ఇతర పక్షాలకు సాధ్యం కావడం లేదు. వంద నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా వంద నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడు హైదరాబాద్లో వరుస రోడ్డు షోలతో ప్రచారంలో పాల్గోంటున్నారు.
పోలింగ్ కు దగ్గర పడుతున్న ఘడియలు..! ప్రచారం లో అగ్ర నేతలు..!
ప్రజాకూటమికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు హిందూపురం ఎం.ఎల్.ఏ బాలకృష్ణ కూడా జతకలిశారు. నగరంలో రోడ్డు షోల్లో పాల్గొంటున్నారు. ఇక రాహుల్గాంధీ రెండు సార్లు రాష్ట్రానికి వచ్చి వెళ్లారు. మేడ్చల్లో జరిగిన ప్రజా కూటమి బహిరంగ సభలో సోనియాగాంధీతో కలిసి రాహుల్ పాల్గొన్నారు. ఖమ్మం, హైదరాబాద్, పరిగి తదితర ప్రాంతాల్లో రోడ్డు షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇక బీజేపీ తరపున అమిత్ షా ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ నిజామాబాద్, మహబూబ్నగర్ బహిరంగ సభల్లో పాల్గొన్నారు.
నేడే అద్బుత ద్రుశ్యం..! జాతీయ నేతలంతా నగరంలోనే..!!
డిసెంబరు 3వ తేదీన హైదరాబాద్లో కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతల ప్రచారంతో తెలంగాణ హోరెత్తనుంది. ఒకేసారి.. ఒకేరోజు ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ హైదరాబాద్కు రానున్నారు. ఇద్దరు వేర్వేరుగా నగరంలో సభల్లో పాల్గొంటున్నారు. ప్రధాని నరేంద్రమోడీ పాల్గొనే బహిరంగ సభ ఎల్బీ స్టేడియంలో జరగబోతోంది. ఇందుకు భాజపా నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాగైనా ఈ సభను విజయవంతం చేయడం ద్వారా నగరంలో బీజేపీ సత్తా చాటాలన్న ప్లాన్లో ఉన్నారు.
పోటా పోటీ ప్రచారం..! నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న పభలు..!!
ఎల్బీ స్టేడియంలో 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు మోడీ సభ జరగనుంది. సరిగ్గా ఇదే సమయంలో రాహుల్గాంధీ కూడా నగరంలోనే బహిరంగ సభలో పాల్గొంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయడుతో కలిసి రాహుల్ 3వ తేదీన సాయంత్రం 4గంటలకు కూకట్పల్లి నియోజకవర్గంలో రోడ్డు షోలో చేపట్టనున్నారు. అనంతరం మూసాపేట సమీపంలో 5 గంటలకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఇలా ఒకే రోజు ఒకే సమయంలో ఒకే నగరంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ వేర్వేరుగా సభల్లో పాల్గొనబోతోండటం విశేషం. అదీగాక వీరిద్దరూ సుమారు పది కిలోమీటర్ల లోపు ప్రాంతంలోనే సభల్లో పాల్గొనబోతున్నారు.