మోదీ .. ఇక సినిమాలకే : దీదీని బెదిరించారని సీపీఐ నారాయణ ఆరోపణ
హైదరాబాద్ : ప్రధానిమోదీపై ఓ రేంజ్లో ఫైరయ్యారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఎన్నికల ఫలితాల తర్వాత మోదీని సినిమా ఇండస్ట్రీకి పంపిస్తామని చెప్పారు. ఇక ఆయన అక్కడే వేషాలు వేసుకోవచ్చని సెటైర్లు వేశారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన సీపీఐ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు.
ఫెయిల్యూర్ పీఎం
ప్రధానిగా మోదీ విఫలమయ్యారని విమర్శించారు. ఐదేళ్లలో చేసిన పనులు, చెప్పిన మాటలను ప్రజలు గమనించారని గుర్తుచేశారు. బీజేపీ ప్రజలు తమ ఓటుతో గుణపాఠం చెబుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో యూపీ, మధ్యప్రదేశ్లో బీజేపీకి భారీగా సీట్లు తగ్గుతాయని అంచనా వేశారు. బెంగాల్లో మమతా బెనర్జీని మోదీ భయపెట్టారని గుర్తుచేశారు. మాతోనే ఉండాలని .. లేదంటే ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని బెదిరించారని ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా మమత బెనర్జీ, మాయావతి వెనక్కి తగ్గలేదని .. మోదీ బెదిరింపులకు భయపడలేదని పేర్కొన్నారు.
కేసీఆర్పై నిప్పులు ..
ఇటు తెలంగాణలో ఫిరాయింపులపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెళ్లైన వారంలోనే మొగుడిని మార్చినట్టు కాంగ్రెష్ గుర్తుతో గెలిచిన నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విమర్శించారు. పార్టీ మారే నేతలతో ఏ నేత, ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. అలాగే పార్టీ ఫిరాయింపులపై సీపీఐ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో కోట్ల రూపాయలు పట్టుకున్నా .. ఒక్కరిపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేయకపోవడం దేనికి నిదర్శమని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.
విద్య మిథ్యేనా ..?
తెలంగాణలో ప్రాథమిక విద్య పాతరేయబడిందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పటికే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించలేదని దుయ్యబట్టారు. అమరవీరుల త్యాగాలతో ప్రత్యేక తెలంగాణ సాకారమైందని గుర్తుచేశారు. కానీ వారి ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శించారు. కేసీఆర్ నేతృత్వంలో పరిపాలన పడకేసిందని, లక్షల్లో అప్పులు పెరిగిపోయాయని దుయ్యబట్టారు.