మరో కోణం: నయీం ముఠాతో ఏఎస్ఐ వడ్డీల మోహన్ రెడ్డి సెటిల్మెంట్లు
హైదరాబాద్/కరీంగనర్: అక్రమ వడ్డీలతో కోట్లకు పడగలెత్తడంతోపాటు, అప్పులు తీసుకున్న వారిని వేధించి వారి ఆత్మహత్యలకు కారణమైన ఏఎస్ఐ మోహన్ రెడ్డికి సంబందించిన సంచలన విషయం బయటికి వచ్చింది. ఇటీవల షాద్ నగర్ లో పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ తో సంబందాలున్నట్లు సమాచారం.
ఈ మేరకు మోహన్ రెడ్డి బాధిత సంఘం అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, మరికొందరు బాధితులు ఆరోపించారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఎల్ఎండీ, పద్మానగర్, నగునూర్ లలో భూ సెటిల్మెంట్లను మోహన్ రెడ్డి.. నయీం ముఠాతో చేయించాడని చెప్పారు.
ఈ క్రమంలో తమతోపాటు మోహన్ రెడ్డి బాధితులందరూ నయీం కేసును విచారిస్తున్న సిట్ బృందానికి శనివారం ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అంతేగాక, మోహన్ రెడ్డి వ్యవహారాలపై లోతుగా విచారణ జరిపితే నయీమ్ ముఠాతో సంబంధాలు బయటపడతాయని అన్నారు.
మోహన్ రెడ్డి ఎక్కువగా దళితులకు సంబందించిన భూములనే అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడని, దీనిపై త్వరలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను కలుస్తామని వివరించారు. బాధితులందరికీ న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని, వారి కోసం న్యాయ పోరాటం చేస్తామని పలు రాజకీయ పార్టీ పేర్కొన్నాయి.