వడ్డీ వ్యాపారి అరాచకం, యజమాని ఇంట్లో లేని సమయంలో ఏం చేశాడంటే...
సిరిసిల్ల: తన వద్ద తీసుకున్న అప్పు తీర్చలేదనే కారణంతో ఓ వడ్డీ వ్యాపారి యజమాని ఇంట్లో లేని సమయంలో అతడి కుటుంబాన్ని ఇంట్లోనే నిర్బంధించిన ఉదంతమిది. ఈ అరాచక ఘటన సిరిసిల్లలోని సుభాష్నగర్లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... సిరిసిల్లలోని సుభాష్నగర్కు చెందిన కృష్ణహరి అనే వస్త్ర వ్యాపారి ఆంజనేయులు అనే వ్యక్తి వద్ద రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో అనుకున్న సమయానికి అప్పు తీర్చలేకపోయాడు.
దీంతో కోపోద్రిక్తుడైన ఆంజనేయులు... కృష్ణహరి ఇంట్లో లేని సమయంలో అతడి ఇంటికి వచ్చాడు. కృష్ణహరి కుటుంబ సభ్యులు లోపల ఉండగానే ఇంటికి బయట తాళం వేసి వెళ్లిపోయాడు.
తన భర్త ఇంట్లో లేని సమయంలో ఆంజనేయులు వచ్చి తమను వేధిస్తున్నాడని కృష్ణహరి భార్య పేర్కొన్నారు. ఇంట్లో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా బయటనుంచి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నిజానికి వ్యక్తులెవరూ వడ్డీ వ్యాపారం చేయకూడదు. ఒకవేళ చేయాలనుకుంటే ఇందుకు నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి లైసెన్సు పొంది ఉండాలి. మరి ఆంజనేయులు అనధికార వడ్డీ వ్యాపారా? లేక అధికారికంగానే ఆ వ్యాపారం చేస్తున్నారా? ఇది పోలీసులే తేల్చాలి.
ఇప్పటికే అక్రమ వడ్డీ వ్యాపారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఒక చట్టాన్ని చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా దృష్టిసారించాల్సిన సమయం ఆసన్నమైంది.